న్యూఢిల్లీ: వచ్చే నెలలో వెస్టిండీస్తో జరుగనున్న టెస్టు సిరీస్ నుంచి సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారాను ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్నే ప్రధానంగా తీసుకుంటే.. జట్టులోని ఇతర ఆటగాళ్ల ప్రదర్శనలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ‘పుజారానే ఎందుకు? చాన్నాళ్లుగా అతడు జట్టు కోసం ఎంతో చేశాడు. కానీ అతడికి సామాజిక మాధ్యమాల్లో కోట్లాది మంది అభిమానులు లేరు. తొలగించినా పెద్దగా విమర్శలు రావు. అతడిని జట్టు నుంచి తప్పించేందుకు ఎలాంటి ప్రమాణాలను పరిగణనలోకి తీసుకున్నారో తెలియదు. సెలెక్షన్ కమిటీ చైర్మన్ వెల్లడిస్తేనే ఆ కారణం తెలుస్తుంది’ అని అన్నాడు.