Ben Stokes : మ్యాచ్ల షెడ్యూల్ మీద అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) దృష్టి పెట్టడం లేదని ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ విమర్శించాడు. ప్రపంచవ్యాప్తంగా దేశవాళీ టీ20 లీగ్లు పాపులర్ కావడంతో టెస్టు క్రికెట్ ప్రమాదంలో పడుతోందని స్టోక్స్ అన్నాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ బోథంతో కలిసి బీబీసీలో మాట్లాడుతూ.. ‘షెడ్యూల్ మీద ఐసీసీ అంతగా దృష్టి పెట్టడం లేదు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సీరస్ నిర్వహించడం అందుకు ఉదాహరణ. వన్డే సిరీస్లోనే మూడు ఫార్మాట్లు ఉన్నాయి అన్నట్టుగా ఐసీసీ ధోరణి ఉంది. టీ 20 లీగ్ల కారణంగా టెస్టు క్రికెట్ మీద అభిమానుల్లో ఆసక్తి తగ్గిపోతోంది. అయితే.. క్రికెటర్లకు ఆడడానికి చాలా ఫార్మాట్లు ఉన్నాయి. అయితే.. నా వరకు మాత్రం టెస్టు ఫార్మాట్ అనేది క్రికెట్కు చాలా ముఖ్యం’ అని స్టోక్స్ అన్నాడు.
టెస్టు క్రికెట్ ఆడే దేశాలు ఇంగ్లండ్ మాదిరిగా ఆటాకింగ్ గేమ్ ఆడాలని స్టోక్స్ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ ఫలితం కంటే అభిమానులను అలరించడమే ముఖ్యం కావాలని, అప్పుడే టెస్టు క్రికెట్ మళ్లీ పాపులర్ అవుతుందని అతను తెలిపాడు. స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ జట్టు 3-0తో పాకిస్థాన్పై టెస్టు సిరీస్ నెగ్గింది. మూడు టెస్టుల సిరీస్లో పాక్ను వైట్వాష్ చేసింది. దాంతో ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఈ ఇంగ్లండ్ ఆల్రౌండర్ భారీ ధర పలికాడు. చెన్నై సూపర్ కింగ్స్ అతడిని రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది. పోయిన ఏడాది స్టోక్స్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. 2019 వన్డే వరల్డ్ కప్లో అద్భుతంగా ఆడిన స్టోక్స్ మ్యాచ్ను సూపర్ ఓవర్ వరకు తెచ్చాడు. సూపర్ ఓవర్లో విజయం సాధించిన ఇంగ్లండ్ తొలిసారి వన్డే ప్రపంచకప్ అందుకుంది.