ధనాధన్ క్రికెట్ పుణ్యమా అని క్రికెట్ అభిమానులకు భారీ స్కోర్లు చూసే భాగ్యం దక్కట్లేదు. హాఫ్ సెంచరీ కొడితే గ్రేట్. సెంచరీ కొడితే లెజెండ్ అనే స్థితికి వచ్చింది పరిస్థితి. అడపాదడపా టెస్టులలో డబుల్ సెంచరీలు చేయడమే గొప్ప అయిన ఈ రోజుల్లో ఒక క్రికెటర్ వన్డేలలో ఏకంగా ట్రిపుల్ సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో అత్యధిక స్కోరు నమోదుచేశాడు. అతడే ఆస్ట్రేలియా ఆటగాడు స్టెఫన్ నీరో.
ఆసీస్ కు చెందిన అంధ క్రికెటర్ స్టెఫన్ నీరో.. 140 బంతుల్లోనే 309 రన్స్ చేశాడు. తద్వారా 1998లో అంధుల క్రికెట్ ప్రపంచకప్ లో పాకిస్తాన్ కు చెందిన అంధ క్రికెటర్ మసూద్ జాన్ నెలకొల్పిన అత్యధిక పరుగుల (262) రికార్డును బద్దలుకొట్టి కొత్త చరిత్రను సృష్టించాడు. మూడు గంటల పాటు సాగిన నీరో బ్యాటింగ్ విన్యాసంలో 49 బౌండరీలు, 1 సిక్సర్ కూడా ఉంది.
ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య కామన్వెల్త్ బ్యాంక్ అంధుల సిరీస్లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా కివీస్తో జరిగిన తొలి వన్డేలో నీరో ఈ ఘనత సాధించాడు. నీరో రికార్డు ట్రిపుల్ సెంచరీతో ఆసీస్.. నిర్ణీత 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 542 పరుగుల చేసింది. కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ 272 రన్స్ కే ఆలౌట్ అయింది. ఫలితంగా 270 పరుగుల భారీ ఆధిక్యంతో ఆసీస్ ను విజయం వరించింది. కాగా బ్యాటింగ్ లో దుమ్ము రేపిన నీరో.. కివీస్ పతనంలో కూడా కీలక భూమిక పోషించాడు. వికెట్ కీపర్ అయిన నీరో.. ఐదు రనౌట్లలో పాలు పంచుకుని న్యూజిలాండ్ ను దెబ్బతీశాడు.
ట్రిపుల్ సెంచరీ సాధించడంతో ఆసీస్ తరఫున ఈ ఘనత సాధించిన ఎనిమిదో క్రికెటర్ గా నీరో రికార్డులకెక్కాడు. గతంలో మాథ్యూ హెడెన్, మైకేల్ క్లార్క్, డేవిడ్ వార్నర్ లు ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. అయితే వీళ్లంతా ట్రిపుల్ చేసింది టెస్టులలో కావడం గమనార్హం.
A TRIPLE century! Steffan Nero finishes 309* (140) in the Australian Blind Cricket Team’s first ODI against New Zealand 🇦🇺
That’s his third consecutive century at the #ICIS22 after scores of 113 (46) and 101* (47) earlier this week 👏 https://t.co/MDTiUnAC1S | #ASportForAll pic.twitter.com/cqv9vBEPW3
— Cricket Australia (@CricketAus) June 14, 2022