హైదరాబాద్, ఆట ప్రతినిధి: భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న 39వ జాతీయ జూనియర్ అక్వాటిక్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పసిడి పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన బాలికల 1500మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో బరిలోకి దిగిన వ్రితి..17:44:33 టైమింగ్తో అగ్రస్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో పోటీపడ్డ శిరిన్, అదితి(కర్ణాటక) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. బాలికల 100మీటర్ల బ్యాక్స్ట్రోక్ విభాగంలో రాష్ట్ర స్విమ్మర్ శ్రీనిత్య సాగి కాంస్య పతకం దక్కించుకోగా, నిశా(కర్ణాటక), తనిశీ గుప్తా స్వర్ణ, రజతాలు ఖాతాలో వేసుకున్నారు. బాలికల 50మీటర్ల బ్రెస్ట్స్ట్రోక్లో మిట్టపల్లి రిత్విక 34:65 సెకన్ల టైమింగ్తో కాంస్య పతకాన్ని ముద్దాడింది. బాలికల 100మీటర్ల బ్యాక్స్ట్రోక్లో కర్రా శివానీ పసిడి పతకంతో మెరిసింది.