రాంచీ: స్టార్ అథ్లెట్ జ్యోతి యర్రాజి ఫెడరేషన్ కప్లో రెండో పసిడి పతకం ఖాతాలో వేసుకుంది. రెండు రోజుల క్రితం మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో పసిడి నెగ్గిన జ్యోతి.. మహిళల 200 మీటర్ల రేసులో అగ్రస్థానంలో నిలిచింది. గురువారం జరిగిన పోటీలో జ్యోతి 23.42 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడి పతకం కైవసం చేసుకుంది.
ఈ ప్రదర్శనతో తెలుగమ్మాయి ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ క్వాలిఫయింగ్ మార్క్ (23.50 సెకన్లు)ను అధిగమించింది. ఈ రేసులో అర్చన (23.61 సె. తమిళనాడు) రజత పతకం చేజిక్కించుకుంది. జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ అథ్లెట్.. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలోనూ ఇదే జోరు కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తంచేసింది.