ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆసియా కప్ నిర్వహించాలని ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి దీన్ని టీ20 ఫార్మాట్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఊదేళ్ల తర్వాత జరిగే ఈ టోర్నీని శ్రీలంక వేదికగా నిర్వహిస్తామని కొన్నిరోజుల క్రితం ఏసీసీ ప్రకటించింది. కానీ ప్రస్తుతం శ్రీలంకలో విపరీతమైన ఆర్ధిక సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే.
అక్కడి ప్రజలు ఆహారం కోసం భారీ క్యూలైన్లలో గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో శ్రీలంకలో ఆసియా కప్ నిర్వహణ సాధ్యమేనా? అనే ప్రశ్న తలెత్తింది. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని శ్రీలంక క్రికెట్ బోర్డును ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అడిగినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ జరగాల్సి ఉంది.
అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ కోసం ఇదొక సన్నాహకంగా ఆటగాళ్లకు ఉపయోగపడుతుందని ఏసీసీ భావించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ టోర్నీని శ్రీలంకలోనే నిర్వహిస్తారా? లేక మరో వేదికకు మారుస్తారా? అనేది తేలాల్సి ఉంది.