బులావయో: క్వాలిఫయింగ్ టోర్నీలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న శ్రీలంక క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్నకు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన సూపర్ సిక్స్ పోరులో లంక 9 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తుచేసింది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ నెగ్గిన లంక 8 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచి భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్ బెర్త్ దక్కించుకుంది.
మొదట జింబాబ్వే 32.2 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. సీన్ విలియమ్స్ (56) టాప్ స్కోరర్ కాగా.. లంక బౌలర్లలో తీక్షణ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లంక 33.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 169 పరుగులు చేసింది. పాతుమ్ నిషాంక (101 నాటౌట్; 14 ఫోర్లు) అజేయ శతకంతో రాణించాడు. తీక్షణకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.