Srilanka | హరారే: వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో శ్రీలంక విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో లంక 128 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ను చిత్తుచేసింది. వన్డేల్లో లంకకు ఇది వరుసగా పదో విజయం కావడం విశేషం. సూపర్ సిక్స్ దశలో సత్తాచాటిన ఈ రెండు జట్లు ఇప్పటికే వన్డే ప్రపంచకప్నకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్న వరల్డ్కప్లో లంక క్వాలిఫయర్-1గా, నెదర్లాండ్స్ క్వాలిఫయర్-2గా బరిలోకి దిగనున్నాయి.
తుదిపోరులో మొదట బ్యాటింగ్ చేసిన లంక 47.5 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేదనలో నెదర్లాండ్స్ 23.3 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. ముగ్గురు ఆటగాళ్లే రెండంకెల స్కోరు చేయగా.. లంక బౌలర్లలో తీక్షణ 4, మధుషనక 3 వికెట్లు పడగొట్టారు. ఈ టోర్నీలో 600 పరుగులు చేసిన జింబాబ్వే ఆటగాడు సీన్ విలియమ్స్ ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గా నిలిచాడు.