కొలంబో: ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన టీ20 సిరీస్లో టీమ్ఇండియా ఓటమి పాలైంది. కరోనా వైరస్ కలకలంతో ప్రధాన ఆటగాళ్లు 10 మంది అందుబాటులో లేకుండా పోవడంతో నెట్ బౌలర్లను తుది జట్టులో ఆడించిన భారత్.. వరుసగా రెండో మ్యాచ్లో పరాజయం పాలై సిరీస్ కోల్పోయింది. గురువారం శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో ధావన్ సేన 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. గత కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న లంక ఎట్టకేలకు టీమ్ఇండియాపై 2-1తో టీ20 సిరీస్ గెలుచుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 81 పరుగులు మాత్రమే చేయగలిగింది. శిఖర్ ధావన్ (0), సంజూ శాంసన్ (0) సున్నాలు చుట్టగా.. మిగిలినవాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.
కుల్దీప్ యాదవ్ (23 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు. లంక బౌలర్లలో వణిండు హసరంగ 4, దసున్ షనక రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో తలా కొన్ని పరుగులు జతచేయడంతో లంక 14.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. రెండో టీ20లో నవ్దీప్ సైనీ గాయపడటంతో అతడి స్థానంలో మరో పేసర్ సందీప్ వారియర్ ఈ మ్యాచ్లో అరంగేట్రం చేశాడు. 9 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టిన హసరంగకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’అవార్డులు దక్కాయి. పొట్టి ఫార్మాట్కు ముందు జరిగిన వన్డే సిరీస్ను ధావన్ సేన చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది చివర్లో జరుగనున్న టీ20 ప్రపంచకప్నకు ముందు భారత జట్టు ఆడిన చివరి పొట్టి సిరీస్ ఇదే కావడం గమనార్హం.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 81/8 (కుల్దీప్ 23 నాటౌట్, భువనేశ్వర్ 16; హసరంగ 4/9, షనక 2/20), శ్రీలంక: 82/3 (ధనంజయ 23 నాటౌట్; రాహుల్ చాహర్ 3/15).