కొలంబో: టాపార్డర్ పోరాటానికి బౌలర్ల సహకారం తోడవడంతో వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక విజయానికి చేరువైంది. వరుణుడి దోబూచులాట మధ్య బుధవారం వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 230 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నె (83), మాథ్యూస్ (69) వేగంగా ఆడి వెస్టిండీస్ ముందు 348 పరుగుల లక్ష్యాన్ని నిలిపారు. టార్గెట్ ఛేజింగ్కు దిగిన విండీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 52 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. చేతిలో 4 వికెట్లు ఉన్న కరీబియన్లు విజయానికి 296 పరుగులు చేయాల్సి ఉంది. బూనెర్ (18), జాషువ డిసిల్వా (15) క్రీజులో ఉన్నారు. లంక బౌలర్లలో రమేశ్ మెండిస్ 4 వికెట్లు పడగొట్టాడు.