కూలిడ్జ్(ఆంటిగ్వా): శ్రీలంక పోటీలోకి వచ్చింది. శనివారం వెస్టిండీస్తో జరిగిన రెండో టీ20లో లంక 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. లంక నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యఛేదనలో డిసిల్వా(3/17), నందకన్(3/10) ధాటికి విండీస్ 117 పరుగులకే కుప్పకూలింది. మెక్కాయ్ (23), సిమన్స్ (21) మినహా అందరూ స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. తొలుత ఓపెనర్ గుణతిలక(56) అర్ధసెంచరీతో లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసింది. బ్రావో(2/25)కు రెండు వికెట్లు దక్కాయి. మూడు వికెట్లతో రాణించిన డిసిల్వాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.