కొలంబో: టీ20 వరల్డ్కప్లో ఇండియాతో ఆడేందుకు పాకిస్థాన్(India Vs Pakistan) సుముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15వ తేదీన జరిగిన మ్యాచ్లో ఇండియాతో తలపడేందుకు పాకిస్థాన్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు థ్యాంక్స్ తెలిపారు. వాస్తవానికి తొలుత ఆ మ్యాచ్ను బాయ్కాట్ చేయనున్నట్లు పాక్ ప్రభుత్వం చెప్పింది. అయితే ఐసీసీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సభ్యులు పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ఆశ్రయించారు. ఇండోపాక్ మ్యాచ్కు వేదికైన శ్రీలంక కూడా పాకిస్థాన్ను అభ్యర్థించింది. మ్యాచ్కు గ్రీన్సిగ్నల్ ఇవ్వాలని తొలుత పాకిస్థాన్ను శ్రీలంక కోరింది.
ప్రతిష్టంభనను తొలగిస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం సోమవారం తీసుకున్న నిర్ణయాన్ని శ్రీలంక అధ్యక్షుడు స్వాగతించారు. కొలంబోలో అనుకున్నట్లే ఇండోపాక్ మ్యాచ్ జరుగుతుందని, దీని పట్ల సంతోషంగా ఉన్నట్లు అనుర తెలిపారు. తన ఎక్స్ అకౌంట్లో ఆయన స్పందించారు. తమ నిర్ణయాన్ని విరమించుకోవాలని తొలుత పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు శ్రీలంక లేఖ రాసింది. ఆ తర్వాత పాక్ ప్రధాని షరీఫ్తోనూ దిసనాయకే మాట్లాడారు. సోమవారం రాత్రి పాక్ ప్రధానికి ఆయన ఫోన్కాల్ చేశారు. శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకే రాసిన లేఖను అధికారికంగా స్వాగతిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది.
టోర్నమెంట్ను నిర్వహిస్తున్న దేశంగా అంతర్జాతీయ క్రికెట్ మండలితో పాటు ఇండోపాక్ మ్యాచ్ నిర్వహణకు చర్యలు తీసుకున్న అందరికీ శ్రీలంక థ్యాంక్స్ చెప్పింది. 1996 వరల్డ్కప్ జరిగిన సమయంలో భారత్, పాక్ చూపిన సంఘీభావాన్ని మరిచిపోలేమని శ్రీలంక పేర్కొన్నది.
Thank you Prime Minister @CMShehbaz for ensuring the game we all love goes on. Delighted that the eagerly awaited India and Pakistan match at the ongoing T20 Cricket World Cup in Colombo will proceed as planned.
As co-host of the tournament, Sri Lanka thanks the @ICC and all…
— Anura Kumara Dissanayake (@anuradisanayake) February 9, 2026