కొలంబో: చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఉత్కంఠ భరిత పోరులో శ్రీలంక 4 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన నాలుగో వన్డేలో గెలుపొందిన లంక.. మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన లంక 49 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ చరిత అసలంక (110) సెంచరీతో కదంతొక్కగా.. ధనంజయ డిసిల్వా (60) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, మార్ష్, మాథ్యూ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో ఆసీస్ 50 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌటైంది. వార్నర్ (99) తృటిలో శతకం చేజార్చుకున్నాడు.