ఐపీఎల్ 14వ సీజన్ను సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ఆరంభించింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ 10 పరుగుల తేడాతో హైదరాబాద్ను ఓడించింది. స్వల్ప స్కోరుకే ఓపెనర్లు పెవిలియన్ చేరినా.. మనీశ్ పాండే, బెయిర్స్టో అద్భుత అర్ధశతకాలు గెలుపుపై ఆశలు కలిగించాయి. బెయిర్స్టో ఔటైన తర్వాత పాండేకు సరైన సహకారం లేకపోవడంతో ఓటమి తప్పలేదు. మనీశ్ ఆఖరి వరకు ఒంటరిపోరాటం చేసినా చివర్లో ధనాధన్ బ్యాటింగ్ చేసే మరో బ్యాట్స్మన్ లేకపోవడంతో మూల్యం చెల్లించుకుంది.
ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ సూపర్ స్టార్ కేన్ విలియమ్సన్ను బెంచ్కే పరిమితం చేయడంపై సన్రైజర్స్ అభిమానులు మండిపడుతున్నారు. ఒత్తిడిలోనూ పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేసే కేన్ లేకపోవడమే ఓటమికి కారణమని అంటున్నారు. మహ్మద్ నబీ స్థానంలో విలియమ్సన్ను తీసుకుంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. నబీ స్థానంలో కేన్ బ్యాటింగ్కు వచ్చి ఉంటే లక్ష్యాన్ని ఛేదించే అవకాశం ఉండేదని సోషల్మీడియాలో పేర్కొంటున్నారు. టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం సరైంది కాదన్నారు. కోల్కతాతో మ్యాచ్కు తుది జట్టు ఎంపికపై అభిమానులు తమ అసంతృప్తిని ట్విటర్లో వ్యక్తం చేస్తున్నారు. అతన్ని పక్కపెట్టడం వల్లే మీరు ఓటమిపాలయ్యారని విమర్శిస్తున్నారు.