హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో క్రీడలకు సముచిత ప్రాధాన్యం లభించింది. ఆర్థిక మంత్రి హరీశ్రావు 2023-24 సంవత్సరానికి క్రీడలకు రూ.134.80 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం(2022-23) రూ.81.01 కోట్లతో పోల్చుకుంటే ఈ సారి రూ.53 కోట్లు అదనంగా నిధులు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇప్పటికే ప్రతీ గ్రామంలో ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నది. బడ్జెట్లో గ్రామీణ క్రీడా ప్రాంగణాలకు పెద్ద పద్దు కింద రూ.45 కోట్లు కేటాయించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్లేయర్లను తీర్చిదిద్దేందుకు ఈ క్రీడా ప్రాంగణాలు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో కొత్త స్టేడియాల నిర్మాణం, ఆధునీకరణ, సదుపాయాల కల్పన కింద రూ.30 కోట్లు, క్రీడా సంఘాలు, ప్లేయర్లకు నగదు ప్రోత్సాహకం కోసం రూ.15 కోట్లు, సాట్స్కు రూ.20.74 కోట్లు, కరీంనగర్, వరంగల్ స్పోర్ట్స్ స్కూల్స్కు రూ.16.53 కోట్లు, తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలకు రూ.7.3 కోట్లు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. మొత్తంగా గతేడాదితో పోల్చుకుంటే ఈసారి కేటాయింపులు పెరిగినట్లు స్పష్టం కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఇప్పటికే పలువురు ప్లేయర్లు జాతీయ, అంతర్జాతీయ క్రీడావేదికలపై తళుక్కున మెరిశారు. ప్రతిష్ఠాత్మక క్రీడా టోర్నీలైన ఒలింపిక్స్, కామన్వెల్త్, ప్రపంచ చాంపియన్షిప్, ప్రపంచకప్లలో పతకాలు, ట్రోఫీలు సాధించడం ద్వారా నిఖత్ జరీన్, పీవీ సింధు, ఇషాసింగ్, ఆకుల శ్రీజ, హుసాముద్దీన్, గొంగడి త్రిష లాంటి ప్లేయర్లు రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేశారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుంటూ ప్రభుత్వ సహకారంతో మరింత మంది యువతీ, యువకులు క్రీడల్లో సత్తాచాటేందుకు సమాయత్తమవుతున్నారు. బడ్జెట్లో క్రీడలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వడం పట్ల క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.