నమస్తే తెలంగాణ, ఆట ప్రతినిధి: క్రీడా పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక ఆరోపణల మీద వచ్చిన కథనాలపై రాష్ట్ర క్రీడా యువజన శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ తక్షణం స్పందించారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ హరికృష్ణపై ఆరోపణలు రావడంతో.. ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసిన మంత్రి.. స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ నియమించారు. ఐదుగురు సభ్యుల కమిటీతో విచారణ చేపట్టి వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆరోపణల అంశం వెలుగులోకి రాగానే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ను కోరారు.
దీంతో మంత్రి తక్షణమే స్పోర్ట్స్ ప్రిన్సపల్ సెక్రటరీ, సాట్స్ ఎండీ, క్రీడా శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో మహిళల పట్ల జరిగిన లైంగిక వేధింపులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ.. ఓఎస్డీని విధుల నుంచి తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘మహిళలు, బాలికలతో అసభ్యంగా ప్రవర్తించినా, కించపరిచే విధంగా మాట్లాడినా వదిలి పెట్టేది లేదు. స్పోర్ట్స్ స్కూల్ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కోసం ఐదుగురు సభ్యులతో కమిటీ వేశాం. ఆ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. క్రీడాకారిణులు, వారి తల్లదండ్రులకు భరోసా కల్పించి వారిలో ధైర్యం నింపేందుకు వెంటనే చర్యలు చేపట్టాం. ఇలాంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. తెలంగాణ సర్కార్ మహిళల సంక్షేమం, అభివృద్ధి, సాధికారత కోసం ఎన్నో కార్యక్రమాలను చేపడుతోంది’ అని వెల్లడించారు. తక్షణ చర్యల్లో భాగంగా ఓఎస్డీ హరికృష్ణ స్థానంలో సుధాకర్కు బాధ్యతలు అప్పగించారు.
స్పోర్ట్స్ స్కూల్ ఘటన వెలుగులోకి రాగానే స్పందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని ట్విట్టర్ వేదికగా మంత్రి శ్రీనివాస్గౌడ్ను కోరారు. ‘ఈ అంశం నన్ను తీవ్రంగా కలిచివేసింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి వాటికి తావు ఉండకూడదు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై తక్షణం చర్యలు చేపట్టాలి. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధితురాళ్లకు న్యాయం చేయాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ను కోరుతున్నా’ అని కవిత ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.