India @ Olympic bid | ఒలింపిక్ క్రీడలు నిర్వహించినప్పుడల్లా మన దేశం బిడ్ దాఖలు చేయాలనే చర్చ తెరపైకి వస్తుంది. కొన్నిరోజులకు అటకెక్కుతుంది. ఈసారి మన కోరిక తీరే సమయం ఆసన్నమైనట్లుగా కనిపిస్తున్నది. అయితే, మన ఈ కోరిక తీరాలంటే మరో 14 ఏండ్లు ఎదురుచూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే స్థాయిని భారత్ 2036 లో అందుకుంటుందంట. ఈ విషయాన్ని స్వయంగా మన కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
2036 ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉన్నదని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీన్ని సాధించేందుకు ఇండియన్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కి రోడ్మ్యాప్ ఇస్తామని చెప్పారు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) క్రీడల నిర్వహణకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని, గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలతో ఆతిథ్య నగరంగా మారుతుందని ఠాకూర్ చెప్పారు. గతంలో 1982 ఆసియా క్రీడలు, 2010 కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇచ్చిందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. ఇప్పుడు భారత్ ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమైందన్నారు.
జీ 20 ప్రెసిడెన్సీని భారత్ ఇంత పెద్ద స్థాయిలో నిర్వహించగలిగినప్పుడు.. ఐఓఏతో కలిపి కేంద్ర ప్రభుత్వం ఒలింపిక్స్ నిర్వహించగలదని భావిస్తున్నట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఒలింపిక్స్కు పూర్తిగా సిద్ధమైన తర్వాతనే భారత్ బిడ్ వేస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి గుజరాత్ రాష్ట్రం చాలాసార్లు ఆసక్తి చూపిందని, అక్కడ హోటళ్ళు, హాస్టల్స్, ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి మౌలిక సదుపాయాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. గుజరాత్లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు సిద్ధమని ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రస్తావించింది.