భారత స్టార్ టేబుల్ టెన్నిస్ ఆటగాడు అచంత శరత్ కమల్ ఈ ఏడాది మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డుకు ఎంపికయ్యాడు. రాష్ట్రపతి భవన్లో నవంబర్ 30వ తేదీన జరిగే వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా శరత్ కమల్ ఈ అవార్డు అందుకోనున్నాడు. బ్యాడ్మింటన్ ఆటగాడు లక్ష్యసేన్, డిస్కస్ త్రోయర్ సీమా పూనియాకు అర్జున అవార్డుకు ఎంపికయ్యారని క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. శరత్ కమల్ 2019లో పద్మశ్రీ, 2004లో అర్జున అవార్డులు అందుకున్నాడు.
ఈ ఏడాది బర్మింగ్హమ్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో శరత్ కమల్ మూడు బంగారు పతకాలతో కలిపి నాలుగు పతకాలు సాధించాడు. దాంతో, ఇప్పటివరకూ 13 కామన్వెల్త్ మెడల్స్ సంపాదించాడు. ఏషియన్ గేమ్స్లో రెండు పతకాలు గెలిచాడు. అంతేకాదు నాలుగు సార్లు ఒలింపిక్స్లో పాల్గొన్నాడు. మనదేశంలో పదిసార్లు సీనియర్ ఛాంపియన్షిప్ గెలిచిన మొదటి టేబుల్ టెన్నిస్ ఆటగాడిగా శరత్ కమల్ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం ఈ స్టార్ ప్లేయర్ యూరోపియన్ లీగ్స్లో ఆడుతున్నాడు.
భారత హాకీ ఆటగాడు ధ్యాన్ చంద్ గౌరవార్థం 2002 సంవత్సరం నుంచి ధ్యాన్చంద్ అవార్డుని ఇస్తున్నారు. ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు మూడు బంగారు పతకాలు (1928, 1932, 1936) గెలవడంలో ధ్యాన్చంద్ కీలక పాత్ర పోషించాడు.