గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో క్రీడా జోష్ నెలకొన్నది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రెండేండ్ల విరామం తర్వాత ఈ ఏడాది శిక్షణా శిబిరాలు అట్టహాసంగా మొదలయ్యాయి. ఇన్ని రోజులు పుస్తకాలతో కుస్తీ పట్టిన పిల్లలు.. మైదానాల్లో ఈలలు, కేరింతలతో ఆటల్లో మునిగి తేలుతున్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీ జంట నగరాల పరిధిలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసింది. శిబిరాలు మొదలుకావడానికి ముందే అన్ని క్రీడా మైదానాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, స్విమ్మింగ్ పూల్స్లో సానిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. ఒక వైపు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్) క్రీడా శిబిరాలకు తోడు జీహెచ్ఎంసీ తర్ఫీదుతో మైదానాలన్నీ కొత్త కళను సంతరించుకున్నాయి.
ఈనెల 31వ తేదీ వరకు జరిగే ఈ శిబిరాల్లో 6 ఏండ్ల నుంచి 16 ఏండ్ల పిల్లలు శిక్షణ పొందుతున్నారు. తమకు ఇష్టమైన క్రీడను ఎంచుకుని అనుభవజ్ఞులైన కోచ్ల సహకారంతో ముందుకెళుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్న తరుణంలో ఇలాంటి శిబిరాలు పిల్లలు మానసికంగా, శారీరకంగా ఉపయోగపడుతాయని తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిన జీహెచ్ఎంసీ అన్ని మైదానాల్లో సౌకర్యాలు కల్పించింది. ప్రస్తుతమున్న వాటికి తోడు త్వరలో మరికొన్ని స్విమ్మింగ్ పూల్స్తో పాటు స్పోర్ట్స్ కాంప్లెక్స్లను నగర ప్లేయర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. మహమ్మద్ అజారుద్దీన్, సైనా నెహ్వాల్, పీవీ సింధు లాంటి ఎంతో మంది అద్భుత ప్రతిభ కల్గిన ప్లేయర్లను ఈ దేశానికి అందించిన జీహెచ్ఎంసీ మరింత మందిని వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందుకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తున్నది. క్రీడలతో పాటు అవగాహన కోసం ప్రత్యేకంగా క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నారు.