హైదరాబాద్, ఆట ప్రతినిధి: దశాబ్ద కాలంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అన్ని రంగాలతో పాటు క్రీడారంగం అభివృద్ధి చెందిందని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అన్నారు. ఇటీవల గోవాలో జరిగిన ఐదవ ఫెడరేషన్ ఐస్ స్కేటింగ్ టోర్నీలో స్వర్ణ, రజత పతకాలు సాధించిన జట్లను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా వారిని సన్మానించిన అనంతరం ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ ‘ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది కాలంగా ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నది.
సరైన విధానాల ఫలితంగానే ఇప్పుడు విజయాల రూపంలో ప్రస్ఫుటమవుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్లేయర్లే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో క్రీడా ప్రాంగణాల అభివృద్ధి, స్టేడియాల నిర్మాణం, పోటీల నిర్వహణ, ప్రోత్సాహకాలు, క్రీడా సామాగ్రి పంపిణీ తదితర విధానాలతో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నది’ అని అన్నారు. టెన్నిస్ టోర్నీలో టైటిల్ గెలిచిన నిషాను సాట్స్ చైర్మన్ అభినందించారు.