South Africa | వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా జట్టు ప్రత్యర్థులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతున్నది. మొదట బ్యాటింగ్ చేస్తే చాలు అలవోకగా మూడొందల పరుగులు చేస్తున్న సఫారీలు చివరి 10 ఓవర్లలో అయితే బౌలర్లను చెడుగుడు ఆడుకుంటున్నారు. గత మ్యాచ్లో ఇంగ్లండ్ బౌలింగ్ను ఊచకోత కోస్తూ.. చివరి 10 ఓవర్లలో 143 పరుగులు రాబట్టిన దక్షిణాఫ్రికా.. తాజాగా బంగ్లాదేశ్తో మ్యాచ్లోనైతే మరో పరుగు ఎక్కువే (144) పిండుకుంది. ఈ క్రమంలో సఫారీ జట్టు మరో రికార్డు కూడా ఖాతాలో వేసుకుంది.
వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సార్లు 350పైచిలుకు పరుగులు చేసిన టీమ్గా రికార్డుల్లోకెక్కింది. సఫారీ జట్టు అత్యధికంగా ఏడుసార్లు ఈ మార్క్ అందుకోగా.. ఆస్ట్రేలియా ఆరుసార్లతో రెండో స్థానంలో ఉంది. ఇక భారత జట్టు వరల్డ్కప్లో నాలుగుసార్లు 350 ప్లస్ స్కోర్లు చేసింది. ప్రస్తుతం ప్రపంచకప్ ఆడుతున్న అన్నీ జట్లలో అత్యంత పటిష్టమైన మిడిలార్డర్ ఉన్న జట్టని విశ్లేషకులు అభిప్రాయపడుతుండగా.. ఇప్పుడు సఫారీలు దాన్ని నిజం చేసి చూపుతున్నారు.
2015 వన్డే ప్రపంచకప్లో లీగ్ దశకే పరిమితమైన ఇంగ్లండ్ జట్టు.. ఆ తర్వాత బ్యాటింగ్ లైనప్ను పూర్తిగా ప్రక్షాళన చేసింది. అప్పటి వరకు సంప్రదాయ ఆటతీరుకు పెద్ద పీట వేసే ఇంగ్లిష్ టీమ్ మేనేజ్మెంట్ ఆ తర్వాత బాదుడే ప్రధాన లక్ష్యంగా జట్టును ఎంపిక చేయడం ప్రారంభించింది. దీంతో నాలుగేండ్లు తిరిగేసరికి ఆ జట్టు ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర జట్టుగా ఎదిగి 2019లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్లో విజేతగా నిలిచింది. ఇప్పుడు దక్షిణాఫ్రికా టీమ్ కూడా అలాగే కనిపిస్తున్నది. నెదర్లాండ్స్ చేతిలో పరాజయం అనంతరం మరింత కసిగా రెచ్చిపోతున్న దక్షిణాఫ్రికా ప్రత్యర్థులపై కనికరం లేకుండా విరుచుకుపడుతున్నది.