ODI World Cup | వన్డే వరల్డ్కప్లో దక్షిణాఫ్రికా దుమ్మురేపింది. ఒకరి వెనక ఒకరు ముగ్గురు బ్యాటర్లు సెంచరీలతో కదం తొక్కడంతో.. ప్రపంచకప్ చరిత్రలో దక్షిణాఫ్రికా రికార్డు స్కోరు నమోదు చేసింది. 1975లో ప్రారంభమైన మెగాటోర్నీలో ఇప్పటి వరకు 2015లో అఫ్గానిస్థాన్పై ఆస్ట్రేలియా చేసిన 417 పరుగులే అత్యధిక స్కోరు కాగా.. ఇప్పుడా రికార్డు బద్దలైంది. శనివారం శ్రీలంకతో మ్యాచ్లో దక్షిణాఫ్రికా వీర విజృంభణతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. విశ్వసమరంలో ఒక జట్టు చేసిన అత్యధిక స్కోరుగా ఇది చరిత్రకెక్కింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), డసెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలతో కదం తొక్కారు.
వచ్చిన వాళ్లు వచ్చినట్లు బాదుకుంటూ వెళ్లడంతో.. దక్షిణాఫ్రికా కొండంత స్కోరు చేయగలిగింది. కెప్టెన్ బవుమా (8) విఫలం కాగా.. డికాక్, డసెన్ రెండో వికెట్కు 204 పరుగులు జతచేసి జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఇక మిడిలార్డర్లో బరిలోకి దిగిన ఎయిడెన్ మార్క్రమ్ విశ్వరూపం చూపాడు. ఢిల్లీ స్టేడియం బ్యాటింగ్కు అనుకూలిస్తుండటంతో పాటు.. బౌండ్రీ చిన్నది కావడంతో.. సఫారీ ప్లేయర్లు దుమ్మురేపారు. ఆఖర్లో హెన్రిచ్ క్లాసెన్ (20 బంతుల్లో 32; 1 ఫోర్, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (21 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా తమ వంతు బాధ్యత నిర్వర్తించడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేయగలిగింది. వరల్డ్కప్లో ఇదే అత్యధిక స్కోరు కాగా.. 2007లో బెర్ముడాపై భారత్ చేసిన 413 స్కోరు మూడో స్థానానికి చేరింది.