కోల్కతా: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ క్రీజు వదిలి బయటకు వచ్చి లాంగాఫ్ మీదుగా భారీ సిక్సర్లతో విరుచుకుపడితే.. మరో మాజీ సారథి మహమ్మద్ అజారుద్దీన్ తన ఆఫ్స్పిన్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. అరే! ఇదేంటి ఎప్పుడో ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి ప్రస్తుతం క్రీడా పాలకులుగా వ్యవహరిస్తున్న వీరిద్దరూ మైదానంలో దిగడం ఏంటీ అనుకుంటున్నారా.. బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశానికి (ఏజీఎమ్) ముందు శుక్రవారం బోర్డు సభ్యులు ఫెస్టివల్ మ్యాచ్ ఆడారు. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన పోరులో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఓ టీమ్కు సారథ్యం వహించగా.. మరో జట్టుకు కార్యదర్శి జై షా నాయకుడిగా వ్యవహరించాడు. 15 ఓవర్ల పోరులో మొదట బ్యాటింగ్కు దిగిన సెక్రటరీ ఎలెవన్ 3 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. జయ్దేవ్ షా (40), అరుణ్ ధుమాల్ (36) రాణించారు. మీడియం పేస్ బౌలింగ్ చేసిన గంగూలీ ఓ వికెట్ పడగొట్టగా.. అజర్ రెండు ఓవర్లు వేసి 8 పరుగులు ఇచ్చాడు. అనంతరం లక్ష్యఛేదనలో ప్రెసిడెంట్స్ ఎలెవన్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసి.. ఒక్క రన్ తేడాతో ఓటమి పాలైంది. గంగూలీ 20 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేసి రిటైర్డ్ కాగా.. అజారుద్దీన్ (2) ఆకట్టుకోలేకపోయాడు. ప్రత్యర్థి జట్టు సారథి జై షా 3 వికెట్లు పడగొట్టాడు.