బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీకాలం ముగియడంతో.. మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తాను భవిష్యత్తులో మళ్లీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) అధ్యక్షుడిగా పోటీ పడతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన మళ్లీ ఈసారి క్యాబ్ అధ్యక్ష పోటీలో నిలుస్తారని అంతా అనుకున్నారు.
అలా అనుకున్న వారందరికీ దాదా షాకిచ్చాడు. నామినేషన్లకు చివరి రోజైన ఆదివారం కూడా తను నామినేషన్ వేయలేదు. దీంతో దాదా సోదరుడు స్నేహాశిష్ గంగూలీ ఈ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియమితుడవబోతున్నాడు. ఈ క్రమంలోనే క్యాబ్ ఉపాధ్యక్ష పదవి కోసం ఆమలేందు బిస్వాస్, సెక్రటరీ పదవి కోసం నరేష్ ఓఝా, జాయింట్ సెక్రటరీ పోస్టు కోసం దేబబ్రత దాస్, ట్రెజరర్గా ప్రబీర్ చక్రవర్తి నామినేషన్లు వేశారు.
క్యాబ్ ఎన్నికల్లో విపక్ష వర్గం నుంచి ఎవరూ నామినేషన్లు వేయకపోవడం గమనార్హం. 2015 నుంచి 2019 వరకు క్యాబ్ అధ్యక్షుడిగా సేవలందించిన సౌరవ్ గంగూలీ.. ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టారు. ఈ సమయంలో జగ్మోహన్ దాల్మియా కుమారుడు అవిషేక్ దాల్మియాకు క్యాబ్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.