స్వదేశమైనా.. విదేశమైనా.. ఫార్మాట్ ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా తాను దిగనంత వరకే. బరిలోకి దిగాడంటే ఇక చరిత్రే. ఈ డైలాగ్ మన హైదరాబాదీ స్పీడ్స్టర్ మహమ్మద్ సిరాజ్కు అతికినట్లు సరిపోతుందేమో. అరంగేట్రం చేసిన అనతికాలంలోనే భారత్కు ఆయువుపట్టులా మారిన సిరాజ్.. లార్డ్స్లో సింహగర్జన చేశాడు. విమర్శకులకు తన పదునైన బౌలింగ్తోనే సమాధానమిస్తూ ఇంగ్లిష్ బ్యాట్స్మెన్ వెన్నులో వణుకు పుట్టించాడు. క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్లో భారత్కు చిరస్మరణీయ విజయాన్నందించాడు. చురకత్తుల్లాంటి బంతులతో ఇంగ్లిష్ జట్టు పతనాన్ని శాసించిన సిరాజ్..భారత బౌలింగ్ అమ్ములపొదిలో ప్రధానాస్త్రంగా మారాడు. షమీ, ఇషాంత్, బుమ్రా లాంటి సీనియర్లతో పోటీపడుతూ హైదరాబాద్ కీ షాన్ అనిపించుకుంటున్నాడు.
‘సిరాజ్ ఉంటే కథ వేరే ఉండేది’
న్యూజిలాండ్తో ప్రతిష్ఠాత్మక టెస్టు చాంపియన్షిప్లో ఓటమి తర్వాత ప్రతి భారత అభిమాని మదిలో మెదిలిన ఆలోచన ఇది. ‘కేఎల్ రాహుల్ను గాకుండా లార్డ్స్ టెస్టులో ఎనిమిది వికెట్లతో ఇంగ్లండ్ నడ్డివిరిచిన మహమ్మద్ సిరాజ్ను ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపిక చేస్తే బాగుండేది’
మచ్చుకు ఈ రెండు ఉదాహరణలు చాలు మన సిరాజ్ భారత టెస్టు జట్టులో ఎంత కీలకంగా మారాడో చెప్పడానికి. కెప్టెన్ విరాట్ కోహ్లీ నమ్మినబంటుగా…బంతి చేతికిస్తే చాలు అద్భుతాలు చేయగలడని నిరూపిస్తున్నాడు. ఆస్ట్రేలియాపై గతేడాది బాక్సింగ్ డే టెస్టులో అరంగేట్రం చేసినప్పటి నుంచి తాజాగా ఇంగ్లండ్తో ముగిసిన లార్డ్స్ టెస్టు వరకు సిరాజ్ మ్యాచ్ మ్యాచ్కు పరిణతి సాధిస్తున్నాడు. నిలకడైన వేగానికి అద్భుతమైన స్వింగ్ జోడిస్తూ ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. కోహ్లీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయని ఈ హైదరాబాదీ.. వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థిని చావుదెబ్బ కొడుతున్నాడు. అలుపుసొలుపు అన్నది లేకుండా బౌలింగ్ చేసే సిరాజ్..టీమ్ఇండియా చిరస్మరణీయ విజయాల్లో కీలక భూమిక అవుతున్నాడు. ఆస్ట్రేలియాతో చరిత్రాత్మక టెస్టు సిరీస్ విజయంతో పాటు సొంత ఇలాఖాలో ఇంగ్లండ్ను మట్టికరిపించడం, ఆ తర్వాత ఇప్పుడు ఇంగ్లిష్ గడ్డపై ఇరుగదీస్తుండటం వరకు సిరాజ్ మానియా కొనసాగుతున్నది.
లార్డ్స్ మ్యాచ్ విషయానికొస్తే తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లతో అదరగొట్టిన సిరాజ్..మలి ఇన్నింగ్స్లో విశ్వరూపం ప్రదర్శించాడు. పరిస్థితులకు అనుగుణంగా స్వింగ్ రాబడుతూ బ్యాట్స్మెన్ను కట్టడి చేయడంలో కీలకమయ్యాడు. వేగంలో వైవిధ్యం ప్రదర్శిస్తూ ఇన్ స్వింగర్లు, ఔట్ స్వింగర్లు, స్లో బంతులతో బ్యాట్స్మెన్ను బోల్తా కొట్టించాడు. ఆఖర్లో క్రీజులో పాతుకుపోయి భారత విజయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన మొయిన్ అలీని అద్భుత బంతితో సిరాజ్ ఔట్ చేసిన తీరు నభూతో నభవిష్యత్. ఆ మరుసటి బంతికే సామ్ కరాన్ను పెవిలియన్ పంపి భారత్ శిబిరాన్ని ఆనందంలో ముంచెత్తాడు. మరో వైపు బుమ్రా, షమీ, ఇషాంత్ వికెట్ల వేట కొనసాగిస్తున్న క్రమంలో కోహ్లీ..అదునుచూసి సిరాజ్ను ప్రయోగించడం మ్యాచ్ను మలుపు తిప్పిందని చెప్పొచ్చు. కొరకరాని కొయ్యగా మారిన బట్లర్ను సాగనంపిన ఈ హైదరాబాదీ..అండర్సన్ను క్లీన్బౌల్డ్ చేసి ఔరా అనిపించాడు. టెస్టుల్లో ఆరువందలకు పైగా వికెట్లు పడగొట్టిన అండర్సన్కు తాను ఎలా ఔటయ్యానో అర్థం చేసుకునే సమయం పట్టిందంటే సిరాజ్ ప్రతిభ ఎట్లా ఉందో అర్థమవుతుంది. వికెట్ పడగొట్టిన తర్వాత నోటికి అడ్డంగా వేలు పెట్టుకుని సిరాజ్ చేస్తున్న సింహనాదం విమర్శకులకు ఘాటైన సమాధానంగా మారింది.
భారత్ను తక్కువ అంచనా వేశాం : రూట్
లండన్: లార్డ్స్ టెస్టులో భారత లోయరార్డర్ను తాము తక్కువగా అంచనా వేశామని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అన్నాడు. మ్యాచ్ అనంతరం రూట్ మాట్లాడుతూ.. తాము వ్యూహాత్మక తప్పిదాలు చేశామని, దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని అంగీకరించాడు. మ్యాచ్ను భారత్ వైపునకు తిప్పిన షమీ, బుమ్రా.. తమ నుంచి విజయాన్ని లాగేసుకున్నారని చెప్పాడు. వారి కోసం సరైన ఫీల్డింగ్ను మొహరించలేకపోయామన్న రూట్.. ఈ విజయంలో వారిరువురికీ కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందేనని తెలిపాడు. తాము తొలి ఇన్నింగ్స్లో ఆడినట్టు రెండో ఇన్నింగ్స్లో ఆడలేకపోయామని రూట్ స్పష్టం చేశాడు. విరాట్ సేన అద్భుతంగా ఆడిందని, అవకాశాలను సద్వినియోగం చేసుకుని విజయం సాధించిందని వెల్లడించాడు.