న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్కు తీవ్ర నిరాశ ఎదురైంది. కరోనా కారణంగా సింగపూర్ ఓపెన్ రద్దవడంతో ఆ ఇద్దరి టోక్యో ఒలింపిక్స్ ఆశలు ఆవిరయ్యాయి. విశ్వక్రీడలకు చివరి అర్హత టోర్నీ నిలిచిపోవడంతో క్వాలిఫికేషన్ ర్యాంకింగ్స్ పాయింట్లలో వెనుకబడి ఉన్న లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా, ప్రపంచ మాజీ నంబర్వన్ శ్రీకాంత్కు టోక్యో తలుపులు దాదాపు మూసుకుపోయాయి . కరోనా వైరస్ విజృంభణ వల్ల ప్రయాణ ఆంక్షలు ఉండడంతో జూన్ 1 నుంచి 6 వరకు జరుగాల్సిన సింగపూర్ ఓపెన్ సూపర్ 500 టోర్నీని రద్దు చేస్తున్నట్టు సింగపూర్ బ్యాడ్మింటన్ సంఘం (ఎస్బీఏ), ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) బుధవారం ప్రకటించాయి. ప్లేయర్లు, సిబ్బంది సహా అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాయి. టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన ప్లేయర్ల జాబితాను త్వరలోనే ప్రకటిస్తామని బీడబ్ల్యూఎఫ్ చెప్పింది. కాగా భారత్ తరఫున మహిళల సింగిల్స్లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, పురుషుల సింగిల్స్లో బి.సాయి ప్రణీత్, పురుషుల డబుల్స్లో సాత్విక్సాయిరాజ్ – చిరాగ్శెట్టి ఒలింపిక్స్ బెర్త్లు దక్కించుకోనున్నారు.
రెండేండ్ల నుంచి గాయాలతో పాటు ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్న కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత సైనా నెహ్వాల్ స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయింది. చాలా టోర్నీల్లో ప్రాథమిక రౌండ్లలోనే నిష్క్రమించి తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో సైనా ర్యాంకు క్రమంగా పడిపోవడంతో పాటు ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ పాయింట్లలోనూ తీవ్రంగా వెనుకబడింది. విశ్వక్రీడల పరిధిలో నిలిచేందుకు 16వ ర్యాంకులోగా ఉండాల్సి ఉండగా.. నెహ్వాల్ ప్రస్తుతం ప్రపంచ 19వ ర్యాంకులో ఉంది. దీంతో పాటు కరోనా కారణంగా మలేషియన్, ఇండియా, సింగపూర్ ఓపెన్తో పాటు అంతకుముందు కొన్ని అర్హత టోర్నీలు కూడా జరుగకపోవడంతో పుంజుకునేందుకు సైనాకు అవకాశం లేకపోయింది. పురుషుల సింగిల్స్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ది ఇదే పరిస్థితి. చాలాకాలంగా రాణించలేకపోయిన అతడు ఒలింపిక్స్ దగ్గర పడడంతో అర్హత టోర్నీల కోసం తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. అయితే కరోనా దెబ్బతో అతడి అవకాశాలు కూడా నీరుగారిపోయాయి. ఒకవేళ కరోనా కారణంగా ముందు ర్యాంకు ప్లేయర్లు తప్పుకుంటే సైనా, శ్రీకాంత్కు టోక్యో ఒలింపిక్స్లో బెర్త్ దక్కే చాన్స్ ఉన్నా.. అలా జరిగే అవకాశాలు స్వల్పమే. కాగా 2020 నుంచి టోక్యో ఒలింపిక్స్ ఈ ఏడాదికి వాయిదా పడ్డాక అర్హత వ్యవధిని పొడిగించిన బీడబ్ల్యూఎఫ్ క్వాలిఫికేషన్ గురించి పూర్తి స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఈ విషయంపై స్పందించాలని భారత బాడ్మింటన్ సమాఖ్య (బాయ్) సైతం బీడబ్ల్యూఎఫ్కు ఇటీవలే సూచించింది.
‘ఒకవేళ మలేషియన్, సింగపూర్ ఓపెన్ టోర్నీల్లో ఆడి ఉంటే నేను టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశం ఉండేది. మళ్లీ పూర్తి ఫామ్లోకి వచ్చేందుకు చాలా కష్టపడ్డా. క్వాలిఫయింగ్ టోర్నీలను ఒకే దేశంలో మెరుగైన క్వారంటైన్ నిబంధనలతో నిర్వహించేలా బీడబ్ల్యూఎఫ్ ప్రణాళిక రచించాల్సింది. తన తప్పు లేకుండా.. టోర్నీలు రద్దు కావడం వల్ల ఓ ప్లేయర్ ఒలింపిక్స్కు దూరం కావడం తీవ్రంగా నిరాశపరిచే విషయం
కిడాంబి శ్రీకాంత్