ఏం చేయాలో తెలియలేదు
టోక్యో పతకం గెలిచిన క్షణాలపై సింధు
టోక్యో: వరుసగా రెండోసారి ఒలింపిక్స్లో పతకం గెలిచి చరిత్ర సృష్టించిన సందర్భంలో ఏం చేయాలో తెలియలేదని తెలుగు షట్లర్ పీవీ సింధు చెప్పింది. ఆనందం.. బాధ ఇలా ఒకేసారి అన్ని భావోద్వేగాలకు గురయ్యానని తెలిపింది. టోక్యో కాంస్య పతక పోరులో అద్భుత విజయం సాధించాక మంగళవారం వర్చువల్ మీడియా సమావేశంలో సింధు మాట్లాడింది. ‘నా మెదడు ఖాళీ అయిపోయింది. నా కోచ్ పార్క్ కన్నీరు పెట్టుకున్నారు. అది నాకు చాలా అపూర్వ సందర్భం. నేను నా కోచ్ను హత్తుకొని ధన్యవాదాలు చెప్పా. ఐదారు సెకన్ల పాటు ఏం చేయాలో తెలియలేదు. గట్టిగా అరిచా. ఆ సమయంలో అన్ని భావోగ్వేగాలు ఒకేసారి ఆవహించాయి. సెమీస్లో ఓడాక నేను ఏడ్చాను. నా కోచ్ పార్క్ టే సంగ్ ధైర్యం చెప్పారు. పతకం సాధించేందుకు 100 శాతం కష్టపడాలన్న కసితో బరిలోకి దిగా అని సింధు చెప్పింది. టోక్యో ఒలింపిక్స్ సెమీస్లో తై జూ యింగ్ చేతిలో ఓడిన సింధు.. కాంస్య పతక పోరులో బింగ్ జియావోను చిత్తుచేసి రెండు విశ్వక్రీడల పతకాలు గెలిచిన తొలి భారత మహిళగా చరిత్రకెక్కింది. 2024 పారిస్ ఒలింపిక్స్కు ఇంకా చాలా సమయం ఉందని, ప్రస్తుతం ఈ సంతోషాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పింది.
గాయం నుంచి పతకం వరకు..
ఒలింపిక్స్కు 25 రోజుల ముందు మోకాలు మడతపడి సింధుకు గాయమైందని మేడ్చల్లోని సుచిత్ర అకాడమీ కోచ్ ప్రదీప్ రాజు చెప్పారు. విశ్వక్రీడల ముందు చికిత్స చేయించి ఏ రిస్క్ తీసుకోకూడదని అనుకున్నామని, అందుకే ఈ విషయాన్ని బయటికి చెప్పలేదని ఆయన తెలిపారు. సింధు త్వరగా కోలుకునేందుకు ఫిజియోలు ఎంతో కృషి చేశారని.. కరోనా సమయంలోనూ వారానికి ఐదు రోజుల పాటు అకాడమీలో సింధు తీవ్రంగా ప్రాక్టీస్ చేసేదని ఆయన చెప్పారు.