న్యూఢిల్లీ: భారత మిక్స్డ్ డబుల్స్ జోడీ సిక్కిరెడ్డి-రోహన్ కపూర్.. వియత్నాం ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-100 టోర్నీ క్వార్టర్స్లో శుక్రవారం సిక్కిరెడ్డి-రోహన్ జంట 21-19, 21-17తో మూడో సీడ్ చాన్ పెంగ్ సూన్-చెహ్ యీ సీ (మలేషియా) ద్వయంపై గెలుపొందింది. గత వారం ఛత్తీస్గఢ్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టైటిల్ చేజిక్కించుకున్న ఈ జంట.. 39 నిమిషాల్లో ముగిసిన పోరులో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. ఆట ఆరంభం నుంచే దూకుడు కనబర్చిన భారత జోడీ.. వరుస గేమ్ల్లో విజయం సాధించింది. శనివారం జరుగనున్న సెమీస్లో ఇండోనేషియాకు చెందిన రెహాన్-లిసా జంటతో భారత ద్వయం అమీతుమీ తేల్చుకోనుంది. ప్రస్తుతం ఈ టోర్నీలో భారత్ నుంచి సిక్కి-రోహన్ జంట మాత్రమే పోటీలో ఉంది.