హైదరాబాద్, ఆట ప్రతినిధి: అమెరికాలో జరిగే స్విమ్మింగ్ అడ్వెంచర్లో రాష్ర్టానికి చెందిన వెటరన్ స్విమ్మర్ గోలి శ్యామల బరిలోకి దిగుతున్నది. అత్యంత చల్లని నీళ్లు, లోతైన ప్రాంతమైన కేటాలిన్ ఐలాండ్ నుంచి లాస్ఏంజిల్స్ వరకు(సుమారు 36కిలోమీటర్లు) జరిగే రేసులో శ్యామల పోటీపడనుంది. ఇందుకోసం త్వరలో అమెరికాకు బయల్దేరి వెళుతున్న శ్యామలను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ బుధవారం ప్రత్యేకంగా అభినందించారు. దేశ, రాష్ట్ర ఖ్యాతి ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. ఇప్పటికే పాక్ జలసంధి(30 కిలోమీటర్లు) ఈదిన రెండో మహిళగా అరుదైన రికార్డు నెలకొల్పిన శ్యామల భవిష్యత్లో మరిన్ని విజయాలు అందుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్యామల కోచ్ ఆయుష్ యాదవ్, రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ కోశాధికారి ఉమేశ్ పాల్గొన్నారు.