అహ్మదాబాద్ : భారత ఓపెనర్ శుభ్మన్ గిల్ ఎట్టకేలకు వన్డే ప్రపంచ కప్లో తొలి మ్యాచ్ ఆడనున్నాడు. డెంగీ జ్వరం కారణంగా ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్తో మ్యాచ్లకు దూరమైన గిల్.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై బరిలోకి దిగే అవకాశం ఉంది. చెన్నైలో ప్రైవేట్ ఆస్పత్రిలో డెంగీ నుంచి కోలుకున్న గిల్ బుధవారం అహ్మదాబాద్ చేరుకున్నాడు. పాక్తో మ్యాచ్కు ముందు ఓసారి తన టెక్నిక్, ఫిట్నెస్ను సరిచూసుకునేందుకు ఈ విధ్వంసక ఓపెనర్ గురువారం నెట్స్లో చెమటోడ్చాడు. గంటపాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ అనంతరం ఫీల్డింగ్ కూడా చేశాడు. దాంతో, అక్టోబర్ 14న దాయాదితో జరిగే మ్యాచ్లో రోహిత్ శర్మతో కలిసి గిల్ ఇన్నింగ్స్ ఆరంభించడం ఖాయం అనిపిస్తోంది.
ఈ ఏడాది ఐదు శతకాలతో భీకర ఫామ్లో ఉన్న గిల్ రాకతో టాపార్డర్ మరింత బలోపేతం కానుంది. పైగా నరేంద్ర మోడీ స్టేడియంలో గిల్కు తిరుగులేని రికార్డు ఉంది. ఈ ఏడాది టీ20ల్లో తొలి సెంచరీ(న్యూజిలాండ్పై)తో పాటు ఐపీఎల్ 16వ సీజన్లో ఈ చిచ్చరపిడుగు ఇదే వేదికపై రెండు శతకాలు కొట్టాడు. తనకు బాగా అచ్చొచ్చిన అహ్మదాబాద్ పిచ్పై పాక్ బౌలర్లను ఉతికారేసేందుకు గిల్ సిద్ధమవుతున్నాడు. గిల్ స్థానంలో రిజర్వ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆసీస్పై గోల్డెన్ డక్తో నిరాశపరిచినా.. అఫ్గనిస్థాన్పై 47 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. సిక్సర్ల వీరుడు రోహిత్ సెంచరీ(131)తో కదంతొక్కగా.. టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. అదే ఊపులో పాక్ను చిత్తు చేసి హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలని రోహిత్ సేన భావిస్తోంది.