న్యూజిల్యాండ్తో జరుగుతున్న పేటీయం సిరీస్ తొలి టెస్టులో భారత యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో చెలరేగాడు. తొలి మ్యాచ్ అడుతూ అరంగేట్రంలోనే అదరగొట్టిన అతనిపై క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసిన తర్వాత శ్రేయాస్ మాట్లాడాడు.
తొలిరోజు 75 పరుగులతో అజేయంగా నిలిచిన అతను ఆరోజు రాత్రి నిద్రకూడా పోలేకపోయానని చెప్పాడు. ‘మొదటి రోజు నేను ఆడిన విధానం చాలా సంతృప్తినిచ్చింది. 75 నాటౌట్గా ఉండటంతో చాలా సంతోషంగా అనిపించింది. అయితే దానివల్ల నిద్ర సరిగా పట్టలేదు. ఎలాగోలా పడుకుంటే ఉదయం ఐదు గంటలకే మెలకువ వచ్చేసింది’ అని చెప్పాడు.
రెండో రోజు ఆటలో న్యూజిల్యాండ్ జట్టు ఆధిపత్యం చెలాయించింది. అయ్యర్ శతకం మినహా టీమిండియా ఆటగాళ్లు ఏమీ సాధించలేకపోయారు. టిమ్ సౌథీ ఐదు వికెట్లతో చెలరేగడంతో 345 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లు చెలరేగిన చోటే న్యూజిల్యాండ్ వికెట్లు తీయడానికి భారత బౌలర్లు కష్టపడ్డారు.
కివీ ఓపెనర్లు యంగ్ (75 నాటౌట్), టామ్ లాథమ్ (50 నాటౌట్) ఇద్దరూ అద్భుతంగా ఆడుతూ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఎంత కష్టపడినా కూడా భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 129 పరుగులు చేసింది.