Shreyas Iyer : భారత జట్టు స్టార్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) పునరాగమనం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఆసియా కప్(Asia Cup 2023) స్క్వాడ్కు ఎంపికైన అయ్యర్ మునపటిలా చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. ప్రస్తుతం అలూర్ క్యాంప్లో ఉన్న అయ్యర్ మళ్లీ జట్టుతో కలవడం చాలా థ్రిల్లింగ్గా ఉందని చెప్పాడు. అంతేకాదు తన వెన్నెముక గాయం, కోలుకున్న తీరు గురించి ఈ స్టార్ బ్యాటర్ బీసీసీఐ(BCCI) వీడియోలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
‘మళ్లీ జట్టులోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక గాయం విషయానికొస్తే.. వెన్నెముకలో ఒక డిస్క్ స్థానభ్రంశం చెందడం వల్ల ఒక నరంపై ఒత్తిడి పడింది. ఆ నొప్పి కింది వరకు అంటే పాదం చివరి వేలు దాకా వ్యాపించింది. అప్పుడు భరించలేనంత నొప్పి ఉండేది. ఆ సమయంలో నాకు ఏం జరుగుందో కూడా చెప్పలేకపోయేవాణ్ణి. ఆ గాయం తర్వాత రెండు రోజులు హాస్పిటల్లో ఉన్నా. ఆ తర్వాత 10 రోజులు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకున్నా.
A journey of excruciating pain, patience and recovery 👏👏@ShreyasIyer15 highlights the contributions of trainer Rajini and Nitin Patel at the NCA in his inspirational comeback from injury 👌👌 – By @RajalArora #TeamIndia | @VVSLaxman281
Full interview 🎥🔽
— BCCI (@BCCI) August 27, 2023
మళ్లీ గాయం తిరగబెట్టడంతో లండన్లో సర్జీరీ చేయించుకున్నా. అక్కడే మూడు వారాలు ఉన్నా. నా పరిస్థితి ఎలా ఉంది? అనేది తెలుసుకోవడం కోసం డాక్టర్ రన్నింగ్ సెషన్ నిర్వహించాడు. మొదటి సెషన్ చాలా కష్టంగా అనిపించింది అని అయ్యర్ తెలిపాడు. ఎన్సీఏకి వచ్చాక ట్రైనర్లు తాను త్వరగా కోలుకోవడంలో, ఫిట్నెస్ సాధించడంలో ఎంతో సాయం చేశారని అన్నాడు. ట్రైనర్ రజిని(Rajini), నితిన్ పటేల్(Nitin Patel) సహకారం మరువలేనిది. వాళ్ల సాయంతోనే నేను త్వరగా ఫిట్నెస్ సాధించా. మళ్లీ జట్టులోకి రాగలిగానంటే అదంతా వాళ్ల చలవే’ అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.
శ్రేయాస్ అయ్యర్, కే ఎల్ రాహుల్
అయ్యర్ నిరుడు మార్చి నుంచి ఆటకు దూరమయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువ కావడంతో లండన్లో సర్జరీ చేయించుకున్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో కోలుకున్నాడు. అక్కడ ఫిట్నెస్పై దృష్టి పెట్టిన అయ్యర్ పురోగతి సాధించాడు. దాంతో, సెలెక్టర్లు అతడికి ఆసియా కప్ బృందంలో చోటు కల్పించారు. అతడి రాకతో ఖాళీగా ఉన్న నాలుగో స్థానం సమస్య తీరినట్టే అనిపిస్తోంది. స్వదేశంలో వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) ఉన్నందున అయ్యర్ ఫామ్లోకి రావడం ఎంతో కీలకం. భారత మేనేజ్మెంట్తో పాటు సగటు అభిమానలు కూడా ఇప్పుడు అదే కోరుకుంటున్నారు. ఆగస్టు 30న ఆసియా కప్ టోర్నీ షురూ కానుంది. భారత్ జట్టు సెప్టెంబర్ 2న దాయాది పాకిస్థాన్తో తలపడనుంది.