Shreyas Iyer | దేశవాళీ క్రికెట్లో ఆడాలని పదే పదే హెచ్చరించినా పట్టించుకోని భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఎట్టకేలకు దారికొచ్చాడు. జాతీయ జట్టులో ఫామ్ కోల్పోయిన లేదా విరామం తీసుకున్న క్రికెటర్లు తిరిగి టీమిండియాలోకి రావాలంటే డొమెస్టిక్ క్రికెట్లో ఆడాల్సిందేనని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీసీసీఐ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఇంగ్లండ్తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్లో భాగంగా తొలి రెండు టెస్టులలో ఆడిన శ్రేయస్ అయ్యర్ వరుసగా విఫలమవడంతో టీమ్ మేనేజ్మెంట్ అతడిని మూడో టెస్టుకు ముందు వేటు వేసింది. తాజాగా అతడు ముంబై తరఫున రంజీ సెమీస్ ఆడనున్నట్టు తెలుస్తోంది. సెమీస్లో భాగంగా ముంబై.. తమిళనాడుతో తలపడబోతున్నది.
అయ్యర్ను దేశవాళీలో ఆడి నిరూపించుకోవాలని బీసీసీఐ సూచించినా అతడు మాత్రం వెన్నునొప్పి ఉందని రంజీల నుంచి తప్పుకున్నాడు. కానీ నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) మాత్రం అయ్యర్కు వెన్నునొప్పి ఏమీలేదని బీసీసీఐకి నివేదిక ఇవ్వడంతో అతడు నాటకం ఆడుతున్నట్టు స్పష్టమైంది. దీంతో అయ్యర్పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా అయ్యర్.. పట్టు వీడాడు. వచ్చే నెల మూడు నుంచి జరుగబోయే రంజీ సెమీస్ మ్యాచ్కు అందుబాటులో ఉంటానని ముంబై రంజీ టీమ్కు సమాచారమిచ్చినట్టు తెలుస్తోంది. ఇదే విషయమై ముంబై రంజీ టీమ్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ… ‘అవును.. తాను (శ్రేయస్) ఫిట్గా ఉన్నానని, రంజీ సెమీఫైనల్స్లో సెలక్షన్కు అందుబాటులో ఉంటానని ముంబై క్రికెట్ అసోసియేషన్కు సమాచారం ఇచ్చాడు..’ అని తెలిపాడు. ఈ ఏడాది సౌతాఫ్రికా సిరీస్తో పాటు భారత్లో ఇంగ్లండ్తో ఆడిన రెండు టెస్టులలోనూ అయ్యర్ విఫలమయ్యాడు.
ఫీల్డ్లోకి వచ్చిన ఇషాన్..
Ishan Kishan returns to cricket field in blue! #IshanKishan #Cricket pic.twitter.com/tYJ6rpK04l
— India Sports News (@IndiaSportNews) February 27, 2024
అయ్యర్తో పాటు టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ కూడా స్వల్ప విరామం తర్వాత క్రికెట్ గ్రౌండ్లోకి అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియాతో గతేడాది నవంబర్లో టీ20 సిరీస్ ఆడిన తర్వాత తొలిసారి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లి వన్డే సిరీస్ ఆరంభంలో భారత్కు తిరిగొచ్చిన ఇషాన్.. రెండు నెలలుగా వార్తల్లో వ్యక్తి అయ్యాడు. స్వదేశంలో అఫ్గాన్తో సిరీస్తో పాటు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు మిస్ అయిన ఇషాన్.. దేశవాళీలో ఆడాలని రాహుల్ ద్రావిడ్ పదే పదే కోరినా వినలేదు. బరోడాలో హార్ధిక్ పాండ్యాతో కలిసి కిరణ్ మోరే అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్న ఇషాన్.. తాజాగా డీవై పాటిల్ టీ20 కప్లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ టోర్నీ తర్వాత ఇషాన్.. నేరుగా ఐపీఎల్ ఆడనున్నాడు.