అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో తెలంగాణ షూటర్ల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే స్టార్ షూటర్ ఇషా సింగ్ స్వర్ణ పతకం కైవసం చేసుకోగా.. ఆదివారం పోటీల్లో రష్మీ రాథోడ్ రజత పతకం ఖాతాలో వేసుకుంది. గుజరాత్ వేదికగా జరుగుతున్న 36వ నేషనల్ గేమ్స్ మహిళల స్కీట్ విభాగంలో రష్మీ 25 పాయింట్లతో వెండి పతకం చేజిక్కించుకుంది. గనేమత్ షెఖాన్ (పంజాబ్, 28 పాయింట్లు), శివాని (మధ్యప్రదేశ్, 17 పాయింట్లు) వరుసగా స్వర్ణ, కాంస్యాలు గెలుచుకున్నారు.
బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో తెలంగాణ జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన సెమీస్లో తెలంగాణ 3-2తో మహారాష్ట్రపై విజయం సాధించింది. మహిళల 3×3 బాస్కెట్బాల్లో తెలంగాణ అమ్మాయిలు ఫైనల్కు చేరుకున్నారు. సెమీస్లో మన జట్టు 21-14తో మహారాష్ట్రపై నెగ్గింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో తెలంగా ణ అథ్లెట్ అగసర నందిని హీట్స్లో అగ్రస్థానంలో నిలిచి ముందంజ వేసింది.