Shikhar Dhawan : భారత జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) క్రికెట్లో వచ్చిన మార్పులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈతరం కుర్రాళ్లు ఆటను పూర్తిగా ఆస్వాదిస్తున్నారని, వైవిధ్యమైన షాట్లను పరిచయం చేస్తున్నారని అన్నాడు. అంతేకాదు వాళ్లను చూసి తాను స్ఫూర్తి పొందుతున్నానని గబ్బర్ చెప్పాడు. ‘క్రికెట్లో వస్తున్న మార్పులను చూస్తుంటే సంతోషంగా ఉంది. జీవింతంలో నిరంతరం జరిగే ప్రక్రియ మార్పు ఒక్కటే. కాలానికి తగ్గట్టు మారిపోవాలి.
కొత్త కొత్త వ్యూహాలు, సరికొత్త షాట్ల(New Cricketing Shots)తో అలరిస్తున్న ఆటగాళ్లను చూడడం ఎంతో బాగుంది. మేము చాలా కాలం నుంచి ఆడుతున్నాం. అయితే.. ఈతరం క్రికెటర్లను చూసి స్ఫూర్తి పొందుతున్నాం. అంతేకాదు యంగ్స్టర్స్ ఆడుతున్న కొత్త షాట్లను ప్రయత్నిస్తున్నాం’ అని ధావన్ తెలిపాడు.
ఈ సందర్భంగా ఈ డాషింగ్ ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్(suryakumar yadav) గురించి ప్రస్తావించాడు. ‘ఒకరోజు నేను సూర్యను ‘ఆ సిక్స్ ఎలా కొట్టావు?’ అని అడిగాను. అందుకు అతను నవ్వి.. ‘ఏముంది.. కొంచెం వంగి బంతిని స్టాండ్స్లోకి పంపాను’ అని చెప్పాడు. దాంతో, సరే.. నేను కూడా నెట్స్లో ఆ షాట్ కొట్టడానికి ప్రయత్నిస్తా అని అన్నాను. ఎందుకంటే..? నెట్ ప్రాక్టీస్ కోసం ఎంతో లగేజ్ తీసుకెళ్తాం. అప్పుడు సూర్యలా సిక్స్ కొట్టడం ఈజీ అవుతుంది అని ధావన్ చెప్పుకొచ్చాడు.
సూర్యకుమార్ యాదవ్, శిఖర్ ధావన్
ఈకాలం క్రికెటర్ల ఆలోచనా విధానంలో వస్తున్న మార్పులను ధావన్ ఇలా వివరించాడు. ‘అప్పట్లో మా కోచ్లు భారీ షాట్లు ఆడకూడదని, బంతిని గాల్లోకి లేపొద్దని చెప్పేవారు. దాంతో, మేమంతా అదే ఆలోచనతో బ్యాటింగ్ చేసేవాళ్లం. కానీ, ఇప్పుడు జట్టులోకి వస్తున్న వాళ్లు అలా కాదు. క్రీజులోకి రావడమే ఆలస్యం.. తమ స్టయిల్లో చెలరేగిపోతున్నారు. వాళ్లలో నచ్చేది ఏంటంటే..? అసలు భయం లేకుండా ఆడుతున్నారు’ అని ధావన్ వెల్లడించాడు.
టీమిండియా గొప్ప ఓపెనర్లలో ఒకడైన ధావన్ ఈమధ్య తరచూ విఫలమవుతున్నాడు. దానికి తోడూ శుభ్మన్ గిల్(shubman gill), ఇషాన్ కిషన్(ishan kishan), రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్ వంటి కుర్రాళ్ల రాకతో ఓపెనింగ్ స్థానానికి గట్టి పోటీ ఉంది. దాంతో, జట్టులోకి తిరిగి రావడం అతడికి కష్టంగా మారింది. అయితే.. పదహారో సీజన్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్(Punjab kings) కెప్టెన్గా గబ్బర్ అదరగొట్టాడు.
ఐపీఎల్ పదహారో సీజన్లో ధావన్
అద్భుత ఇన్నింగ్స్లతో జట్టును ముందుండి నడిపించాడు. దాంతో, వెస్టిండీస్ పర్యటనతో మళ్లీ టీమిండియా తలుపు తడతాడని అనుకున్నారంతా. కానీ, సెలెక్టర్లు యువకులకే ప్రాధాన్యమివ్వడంతో నిరాశకు గురయ్యాడు. విధ్వంసక ఆటగాడైన ధావన్ 34 టెస్టుల్లో 7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలతో 2,315 రన్స్ కొట్టాడు. 167 వన్డేల్లో 6,793 పరుగులు సాధించాడు. అందులో 17 శతకాలు, 39 అర్ధ శతకాలు ఉన్నాయి. టీ20ల్లో గబ్బర్ 1,759 రన్స్ చేశాడు.