Ashish Nehra : న్యూజిలాండ్ సిరీస్లో అద్భుతంగా ఆడుతున్న టీమిండియా యంగ్ ప్లేయర్ శుభ్మన్ గిల్పై మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా ప్రశంసలు కురిపించాడు. పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఓపెనర్లు ఉన్నా కూడా శుభ్మన్ మాత్రమే వన్డేలు, టీ 20ల్లో భారీ సెంచరీలు కొట్టగలడు అని నెహ్రా అభిప్రాయపడ్డాడు. ‘శుభ్మన్ గిల్ పరిస్థితులకు తగ్గట్టు ఆడతాడు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో అదే చేస్తున్నాడు. ప్రతిభావంతులైన ఆటగాళ్లలో శుభ్మన్ ఒకడు. టీమిండియా తరఫున వన్డేలు, టీ20ల్లో అతను భారీ సెంచరీలు చేయగలడు. భారత జట్టు తర్వాతి ఓపెనర్గా పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, గిల్ ఇండియాకు ఫుల్ టైమ్ ఓపెనర్ అవుతాడు’ అని నెహ్రా తెలిపాడు.
న్యూజిలాండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో శుభ్మన్ గిల్ అదరగొడుతున్నాడు. మొదటి వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన అతను రెండో వన్డేలో 44 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. పోయిన ఏడాది ఐపీఎల్లో విజేత గుజరాత్ టైటన్స్ జట్టులో గిల్ సభ్యుడు. అంతకు ముందు అతను కోల్కతా నైట్ రైడర్స్కు ఆడాడు. గత కొంత కాలంగా వన్డేలు, టీ 20ల్లో భారత్కు ఓపెనింగ్ సమస్య ఎదురవుతోంది. సీనియర్లు విఫలం అవుతుండడంతో పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్ మధ్య ఓపెనర్ ప్లేస్ కోసం పోటీ నెలకొంది.