Shardul Thakur | టీమిండియా సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ జాతీయ జట్టులో చోటు కోల్పోయినా దేశవాళీలలో మాత్రం నిలకడగా రాణిస్తున్నాడు. సోమవారం ముగిసిన రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో భాగంగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో ముంబై జట్టు.. 106 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్కు వచ్చిన శార్దూల్.. 88 బంతుల్లోనే సెంచరీ చేసి ముంబై భారీ స్కోరు సాధించేందుకు దోహదపడ్డాడు.
బ్యాట్తో పాటు బంతితోనూ రాణించడంతో ముంబై విజయంలో అతడు కీలకపాత్ర పోషించాడు. ఇదే మ్యాచ్లో తమిళనాడు తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్లు పడగొట్టిన శార్దూల్.. రెండో ఇన్నింగ్స్లో అయితే నిప్పులు చెరిగాడు. సెకండ్ ఇన్నింగ్స్లో 10 ఓవర్లే వేసిన అతడు.. 4 మెయిడిన్లు వేసి 16 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ తీసిన వికెట్లలో సాయి సుదర్శన్, జగదీశన్ వంటి కీలక బ్యాటర్లు ఉండటం గమనార్హం. రంజీలలో భాగంగా ఈ ఏడాది ముంబై తరఫున ఐదు మ్యాచ్లు ఆడిన శార్దూల్.. 15 వికెట్లు పడగొట్టడం విశేషం.
Shardul Thakur scored a century and picked two quick wickets. 🔥pic.twitter.com/PHr4dVud2h
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 4, 2024
కమ్బ్యాక్ సాధ్యమేనా..?
రంజీలలో రాణించడంతో శార్దూల్ జాతీయ జట్టులోకి కమ్బ్యాక్ ఇస్తాడా..? అంటే మాత్రం నో అనే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతానికి భారత జట్టు ఇంగ్లండ్తో ఐదో టెస్టు ముగిసిన తర్వాత అంతర్జాతీయ మ్యాచ్లేమీ ఆడదు. మార్చి 22 నుంచి మే చివరివారం వరకూ ఐపీఎల్ జరుగుతుండగా ఆ తర్వాత జూన్లో టీ20 వరల్డ్ కప్ మొదలుకానుంది. పొట్టి ప్రపంచకప్లో శార్దూల్ చోటు దక్కించుకోవడం అంటే ప్రస్తుతం టీమిండియాలో ఉన్న పోటీని చూస్తే అతిశయోక్తే అని చెప్పొచ్చు. కానీ ఆగస్టు – సెప్టెంబర్లో భారత్ మళ్లీ బంగ్లాదేశ్ సిరీస్తో టెస్టు సిరీస్లు మొదలుపెట్టనుంది. అప్పటివరకూ శార్దూల్ ఇదే ఊపు కొనసాగిస్తే జాతీయ జట్టులోకి వచ్చే అవకాశాలుంటాయి.