IPL 2024 | కొంతకాలంగా గాయాలతో సతమతమవుతూ భారత జట్టుకు దూరమైన పలువురు క్రికెటర్ల రీఎంట్రీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా అభిమానులకు కీలక అప్డేట్స్ ఇచ్చాడు. వన్డే వరల్డ్ కప్ తర్వాత కాలి గాయంతో జాతీయ జట్టుకు దూరమైన మహ్మద్ షమీ.. ఇప్పటికే ఐపీఎల్ మిస్ కాగా తాజాగా అతడు జూన్లో జరుగబోయే ఐసీసీ టీ20 ప్రపంచకప్ కూడా మిస్ కానున్నట్టు జై షా అన్నాడు. అయితే టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్కు మాత్రం పొట్టి ప్రపంచకప్లో ఆడే అవకాశం ఉన్నట్టు షా తెలిపాడు. అలాగే కేఎల్ రాహుల్ హెల్త్ అప్డేట్ పైనా కామెంట్స్ చేశాడు.
షమీ ఔట్..
వన్డే వరల్డ్ కప్లో కాలిగాయంతోనే ఆడిన షమీ.. దక్షిణాఫ్రికాతో పాటు స్వదేశంలో ఇంగ్లండ్తో ముగిసిన ఐదు టెస్టుల సిరీస్కూ దూరమయ్యాడు. ఇటీవలే యూకేకు వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్న షమీ.. సెప్టెంబర్లో స్వదేశంలోనే బంగ్లాదేశ్తో జరిగే సిరీస్కు అందుబాటులోకి వస్తాడని జై షా అన్నాడు. ‘షమీ సర్జరీ విజయవంతమైంది. అతడు భారత్కు తిరిగొచ్చాడు. షమీ బంగ్లాదేశ్ సిరీస్లో రీఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి..’ అని చెప్పాడు.
పంత్ వస్తే కాదంటామా..?
2022 డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్కు వెళ్తూ రోడ్డు ప్రమాదం బారిన పడి సుమారు 15 నెలలుగా క్రికెట్కు దూరమైన రిషభ్ పంత్ పూర్తిస్థాయిలో కోలుకున్నాడని, అతడు త్వరలోనే ఐపీఎల్ ఆడనున్నట్టు జై షా వెల్లడించాడు. అయితే ఒకవేళ అతడు టీ20 వరల్డ్ కప్ ఆడాలనుకుంటే పంత్ పేరును కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటామని, అతడు టీమ్కు అతిపెద్ద ఆస్తి అని షా చెప్పాడు. ‘పంత్ పూర్తిగా ఫిట్ అయ్యాడు. అతడు బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు. కీపింగ్ కూడా బాగుంది. ఒకవేళ అతడు టీ20 వరల్డ్ కప్లో ఆడాలనుకుంటే అది మాకు చాలా పెద్ద విషయం..’ అని తెలిపాడు. అయితే పంత్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఏ మేరకు రాణిస్తాడు..? వికెట్ కీపింగ్ చేయగలడా..? లేక ఒక్క బ్యాటర్గానే కొనసాగుతాడా..? అన్నదాన్నిబట్టి తుది నిర్ణయం ఉండనున్నట్టు తెలుస్తోంది.
రాహుల్ ఫిట్..!
వన్డే వరల్డ్కప్లో నిలకడగా రాణించి ఆ తర్వాత సౌతాఫ్రికా టూర్లోనూ ఫర్వాలేదనిపించి స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ఆడిన కేఎల్ రాహుల్ ఆ తర్వాత గాయంతో జట్టును వీడిన విషయం తెలిసిందే. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న రాహుల్.. ఇటీవలే యూకేకు వెళ్లి వైద్యులను సంప్రదించాడు. రాహుల్ బాగానే ఉన్నాడని వైద్యులు చెప్పడంతో ప్రస్తుతం అతడు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రిహాబిటేషన్ పొందుతున్నాడు. రాహుల్ రీఎంట్రీపై జై షా స్పందిస్తూ… ‘కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఎన్సీఏలో రిహాబిటేషన్లో ఉన్నాడు. త్వరలోనే అతడు కూడా పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడు..’ అని చెప్పాడు.