ఢాకా:బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబల్హసన్ తన దురుసు ప్రవర్తనతో మరోమారు వార్తల్లోకెక్కాడు. దేశవాళీ టీ20 టోర్నీలో భాగంగా అబహనీ లిమిటెడ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మొహమ్మదీన్ స్పోర్టింగ్ తరఫున ఆడిన షకీబ్ పట్టరాని కోపంతో ఊగిపోయాడు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో ముష్ఫీకర్ రహీమ్ ఎల్బీడబ్ల్యూ కోసం షకీబ్ చేసిన అప్పీల్ను అంపైర్ తిరస్కరించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన షకీబ్ అగ్రహంతో వికెట్లను కాలితో తన్ని అంపైర్ పైపైకి దూసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా మ్యాచ్ ఆరో ఓవర్లో మిడాఫ్లో ఫీల్డింగ్ చేస్తున్న షకీబ్…వికెట్లు మొత్తం చేత్తో తీసి అంపైర్పై అసభ్య పదజాలంతో రెచ్చిపోయాడు. ఆరో ఓవర్లో ఒక బంతి మిగిలుండగా..వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపివేయడం ఈ స్టార్ ఆల్రౌండర్ కోపానికి కారణమైంది. అయితే ఇదంతా వీడియోలో స్పష్టంగా కనిపించింది. వర్షం అంతరాయం కల్గించిన ఈ మ్యాచ్లో మొహమ్మదీన్ జట్టు గెలిచింది. దురుసు ప్రవర్తనకు షకీబ్పై లెవల్-3 తప్పిదం కింద ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంది. చేసిన తప్పునకు క్షమాపణ కోరిన షకీబ్ సోషల్మీడియాలో సందేశాన్ని రాసుకొచ్చాడు.