దుబాయ్: ఈసారి టీ20 వరల్డ్కప్( T20 World Cup ) మ్యాచ్ ఆరంభమే అదరిపోనుంది. ఇండియా, పాకిస్థాన్ మధ్య జరగబోయే హైవోల్టేజ్ మ్యాచ్తోనే టోర్నీ ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్ కోసం కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్న అంచనాలు అప్పుడే మొదలయ్యాయి. ఇప్పటి వరకూ ఎన్నో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ల్లో ఆడిన అనుభవం ఉన్న పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఈ మ్యాచ్ విజేతపై తన అభిప్రాయం చెప్పాడు. అధిక ఒత్తిడి ఉండే ఈ మ్యాచ్లో ఎవరు ఆ ఒత్తిడిని బాగా హ్యాండిల్ చేస్తారో, ఎవరు ఎక్కువ తప్పులు చేయరో వాళ్లే విజేతగా నిలుస్తారని అఫ్రిది అన్నాడు.
ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అఫ్రిది స్పందించాడు. ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఎప్పుడూ అధిక ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడిని అధిగమించే టీమే విజయం సాధిస్తుంది. అంతేకాదు తక్కువ తప్పిదాలు చేసే టీమ్కే ఎక్కువ అవకాశాలు ఉంటాయని కూడా అఫ్రిది అన్నాడు. దాయాదుల మధ్య మ్యాచ్ ఈ నెల 24న జరగనుంది. ఇప్పటి వరకూ వరల్డ్కప్స్లో ఎప్పుడూ ఇండియాపై పాక్ గెలవలేదు. వన్డే, టీ20 వరల్డ్కప్లు కలిపి 12 మ్యాచ్లు జరగ్గా అన్నింట్లోనూ ఇండియాదే విజయం. దీంతో ఈ మ్యాచ్లోనూ విరాట్ కోహ్లి సేన ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది.