మెల్బోర్న్: వచ్చే ఏడాది టీ20 క్రికెట్ వరల్డ్కప్ టోర్నీ ఆస్ట్రేలియాలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ టోర్నీకి చెందిన ఏడు వేదికలను ఖరారు చేశారు. నిజానికి 2020లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 వరల్డ్కప్ కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లు వాయిదా వేశారు. అయితే ఆ టోర్నీని వచ్చే ఏడాది అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 మధ్య నిర్వహించనున్నారు. మొత్తం 45 మ్యాచ్లు ఉంటాయి. ఆడిలైడ్, బ్రిస్బేన్, గీలాండ్, హోబర్ట్, మెల్బోర్న్, పెర్త్, సిడ్నీ వేదికల్లో మ్యాచ్లు జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ మాత్రం మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఉంటుంది. సిడ్నీ, అడిలైడ్ వేదికల్లో సెమీస్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. టీ20 వరల్డ్కప్ కోసం 12 జట్లు లైనప్లో ఉన్నాయని, క్వాలిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు వేచి ఉండాల్సి ఉందని ఈవెంట్ హెడ్ క్రిస్ టెట్లే తెలిపారు. దుబాయ్లో తాజాగా ముగిసిన టీ20 వరల్డ్కప్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక వచ్చే ఏడాది జరిగే టోర్నీలో స్వంత గడ్డపై ఆ జట్టు ఫెవరేట్గా బరిలో దిగే ఛాన్సుంది. ఈ ఏడాది ఫైనల్ రన్నరప్ న్యూజిలాండ్తో పాటు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, పాకిస్థాన్, సౌతాఫ్రికాలు కూడా వచ్చే టోర్నీకి సెలక్ట్ అయ్యాయి. సూపర్12 అర్హత కోసం శ్రీలంక, వెస్టిండీస్లు ప్రిలిమినరీ రౌండ్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది.