న్యూఢిల్లీ: పారిస్ (2024) ఒలింపిక్స్ కోసం కేంద్ర క్రీడాశాఖ ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్’ (టాప్స్)లో మరికొంత మంది ప్లేయర్లను తీసుకుంది. విశ్వక్రీడల్లో పతకాలు గెలిచే అవకాశమున్న వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఏర్పాటైన టాప్స్ స్కీమ్లో తెలంగాణ నుంచి ఏడుగురు ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. గురువారం సమావేశమైన మిషన్ ఒలింపిక్ సెల్(ఎమ్వోసీ) ఓవరాల్గా 193 మంది ప్లేయర్లను ప్రకటించింది. బ్యాడ్మింటన్ కేటగిరీలో తెలంగాణ నుంచి డబుల్స్ స్పెషలిస్టు సిక్కిరెడ్డి, గంధం ప్రణవ్రావు, విష్ణువర్ధన్గౌడ్, గాయత్రి గోపీచంద్, సామియా ఇమాద్ ఫారూఖీ ఎంపికయ్యారు. వీరితో పాటు స్టార్ షట్లర్లు సింధు, శ్రీకాంత్, సైనా నెహ్వాల్, సాయి ప్రణీత్, సాత్విక్సాయిరాజ్ ఉన్నారు. బాక్సింగ్ విషయానికొస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో నిలకడగా రాణిస్తూ పతకాలు కొల్లగొడుతున్న ఇందూరు బాక్సర్లు మహమ్మద్ హుసాముద్దీన్, నిఖత్ జరీన్ టాప్స్లో చోటు దక్కించుకున్నారు.