టీ20 ప్రపంచకప్-2022 సన్నాహకాల్లో భాగంగా బెంచ్ ను పరిశీలించేందుకు గాను టీమిండియా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనే ఇస్తున్నాయి. సీనియర్ల జట్టుతో పాటు కుర్రాళ్లతో కూడిన జట్టులో యువ క్రికెటర్లు తమకు అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకుంటున్నారు. తమను జట్టునుంచి తీసేయడానికి వీళ్లేకుండా అద్భుత ప్రదర్శనలతో రెచ్చిపోతున్నారు. దక్షిణాఫ్రికా సిరీస్ లో ఇషాన్ కిషన్ మెరవగగా ఐర్లాండ్ తో దీపక్ హుడా, సంజూ శాంసన్ లు తమ సత్తా ఏంటో చెప్పకనే చెప్పారు.
ఐర్లాండ్ తో రెండు మ్యాచులలో (47 నాటౌట్, 104) రాణించాడు దీపక్ హుడా. ముఖ్యంగా మంగళవారం డబ్లిన్ లో ముగిసిన రెండో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగి టీ20 కెరీర్ లో తొలి సెంచరీ బాదాడు. మరోవైపు రాక రాక వచ్చిన అవకాశాన్ని సంజూ శాంసన్ కూడా ఒడిసిపట్టుకున్నాడు. 42 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 77 పరుగులు సాధించాడు. వీరిద్దరి విజృంభణతో భారత జట్టు భారీ స్కోరు చేసింది. అయితే ఈ ఇద్దరి వీర విన్యాసాలతో భారత జట్టు సెలక్టర్లకు కొత్త తలనొప్పి పట్టుకుందంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్.
ఐర్లాండ్ తో మ్యాచ్ అనంతరం ట్విటర్ వేదికగా మంజ్రేకర్ స్పందిస్తూ.. ‘హుడా, శాంసన్ ల అదిరిపోయే ప్రదర్శన తర్వాత సెలక్టర్లకు తలనొప్పి కాస్తా మైగ్రేన్ గా మారింది’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ కోసం సరైన జట్టును ఎంపిక చేసే పన్లో ఉన్న సెలక్టర్లకు కొత్త కుర్రాళ్లు తమ టాప్ లేపే ప్రదర్శనలతో వారికి నిద్ర లేకుండా చేస్తున్నారని మంజ్రేకర్ చెప్పకనే చెప్పాడు.
కాగా ఇటీవలే ముగిసిన దక్షిణాఫ్రికా సిరీస్ లో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించాడు. తనకున్న పరిధిలో దూకుడుగా ఆడుతూ తనను టీ20 ప్రపంచకప్ కు ఎంపిక చేయాల్సిందే అన్న విధంగా సాగింది అతడి విధ్వంసం. ఇక ఐర్లాండ్ సిరీస్ లో ఆ బాధ్యతను దీపక్ హుడా మోశాడు. మరి టీ20 ప్రపంచకప్ కంటే ముందు జరగాల్సి ఉన్న ఇంగ్లాండ్, వెస్టిండీస్ సిరీస్ లతో పాటు ఆసియా కప్ లో ఈ యువకులకు సెలక్టర్లు ఎంత మేరకు అవకాశాలిస్తారో వేచి చూడాలి.
And after that Hooda & Samson show. Selectors’ headache has nicely turned into a migraine.#T20WorldCup
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) June 28, 2022