న్యూఢిల్లీ, జనవరి 27: పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న అంశంపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పును వెలువరించనున్నది. దీనిపై కేంద్రం, రాష్ర్టాల తరఫు వాదనలను ఇదివరకే విన్న జస్టిస్ నాగేశ్వర రావుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గతేడాది అక్టోబర్ 26న తీర్పును రిజర్వ్లో ఉంచింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినప్పటికీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఉన్నతస్థాయి వర్గాలతో సమానంగా తీసుకురాలేకపోయామని గతంలో కేంద్రం వాదించింది. గ్రూప్ ఏ వంటి ఉన్నత క్యాటగిరీ ఉద్యోగాలను ఎస్సీ, ఎస్టీలు పొందడం కొంచెం కష్టమైన విషయమని, వారికి కొన్ని వెసులుబాట్లు కల్పించాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కాగా పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించబోమని, రిజర్వేషన్లపై రాష్ర్టాలు నిర్ణయం తీసుకోవాలనుకొంటే తీసుకోవచ్చని 2018లోనే సుప్రీంకోర్టు చెప్పింది.