కౌలాలాంపూర్: సీజన్ ఆరంభ టోర్నీలో భారత షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి విజృంభిస్తున్నారు. మలేషియా ఓపెన్లో వరుస విజయాలు నమోదు చేసుకున్న ఈ జోడీ ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-1000 పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడీ 21-18, 22-20తో ప్రపంచ చాంపియన్లు సియో సాగ్ జాయ్-కాంగ్ మిన్ (కొరియా) ద్వయంపై విజయం సాధించింది.
నిరుడు ఆసియా గేమ్స్లో స్వర్ణంతో పాటు ఆరు టైటిల్స్ ఖాతాలో వేసుకున్న సాత్విక్ జంట.. ఈ టోర్నీలో అదే జోరు కొనసాగించింది. తీవ్ర ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్లో ఒక దశలో ఆరు పాయింట్లతో వెనుకంజలో ఉండి కూడా.. వరుసగా ఎనిమిది పాయింట్లు నెగ్గి మ్యాచ్ను ముగించింది.