Sanju Samson: వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు గురువారం నుంచి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్నది. ఈ మేరకు సోమవారం రాత్రి ఆలిండియా సెలక్షన్ కమిటీ.. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని యువ భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో కేరళ బ్యాటర్, ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడే సంజూ శాంసన్కు మరోసారి మొండిచేయే మిగిలింది. వన్డే ప్రపంచకప్లో కూడా అతడిని పక్కనబెట్టిన సెలక్టర్లు.. తాజాగా టీ20లకూ పక్కనబెట్టడంతో అసలు అతడిని తిరిగి జట్టులోకి ఎంపికచేస్తారా..? సంజూ కెరీర్ పూర్తిగా ముగిసినట్టేనా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆస్ట్రేలియాతో మొదలుకాబోయే టీ20 సిరీస్తో భారత్.. 2024 టీ20 ప్రపంచకప్కు సన్నాహకాలు మొదలుపెట్టిందని చెప్పడంలో సందేహమే లేదు. ఆ మేరకు జట్టును తీర్చిదిద్దే పనిలో ఉంది. యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్, శివమ్ దూబే వంటి ఆటగాళ్లను ఎంపికచేసిన సెలక్టర్లు.. సంజూను మాత్రం పక్కనబెట్టారు. ఒకట్రెండు మార్పులు మినహా ఈ జట్టులో కూడా పెద్దగా మార్పులు ఆశించడానికి లేదు. 2024 దాకా ఈ ఆటగాళ్లనే కొనసాగించి వారిని రాటుదేల్చే పనిలో సెలక్టర్లు ఉన్నారు.
– No Sanju Samson in ODIs.
– No Sanju Samson in Asian Games.
– No Sanju Samson in T20 series vs Australia.It’s getting very tough for Sanju Samson to get a permanent spot in 15. pic.twitter.com/GtDZK1HZoH
— Johns. (@CricCrazyJohns) November 20, 2023
వికెట్ కీపర్ బ్యాటర్ అయిన శాంసన్ స్థానంలో సెలక్టర్లు ఇషాన్ కిషన్ను ప్రమోట్ చేస్తుండటం గమనార్హం. అతడికి బ్యాకప్గా కూడా మరో యువకుడు జితేశ్ శర్మను ఎంపికచేయడాన్ని బట్టి సంజూను పొట్టి ఫార్మాట్లో కూడా పక్కకుబెట్టినట్టేనని వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ సంజూ టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఒకటే మార్గం ఉంది. ఐపీఎల్ – 2024లో బాగా రాణించి సెలక్టర్లను మెప్పించగలిగితే సెలక్టర్లు అతడిని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. లేకుంటే ఇక సంజూ కెరీర్ ముగిసినట్టేనని అతడి అభిమానులు వాపోతున్నారు.