మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో భారత స్టార్ జోడీ సానియా మీర్జా, రోహన్ బోపన్న ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో సానియా, బోపన్న ద్వయం 7-6(5), 6-7(5), 10-6తో మూడో సీడ్ జంట డెసిరె క్రాజిక్, నీల్ స్పక్సిపై అద్భుత విజయం సాధించింది. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన సెమీస్ పోరులో అన్సీడెడ్ భారత జోడీ అసమాన పోరాట పటిమ కనబరిచింది. తన కెరీర్లో ఆఖరి గ్రాండ్స్లామ్ ఆడుతున్న టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా చిరస్మరణీయ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. గంటా 52 నిమిషాల పాటు సాగిన పోరులో ఆద్యతం ఆధిక్యం చేతులు మారుకుంటూ వచ్చింది.
తొలిసెట్ను సానియా, బోపన్న దక్కించుకోగా, మలి సెట్ను ప్రత్యర్థికి చేజార్చుకుంది. మూడు పదుల వయసులోనూ హైదరాబాదీ సానియా తనదైన ఆటతీరుతో అభిమానులను అలరించింది. పదునైన సర్వ్లకు తోడు ఫోర్హ్యాండ్, బ్యాక్హ్యాండ్ షాట్లతో ఆకట్టుకుంది. బోపన్న సహకారంతో ఆఖరిదైన మూడో సెట్ను టైబ్రేక్లో దక్కించుకుని మ్యాచ్ను కైవసం చేసుకుంది. శనివారం జరిగే ఫైనల్లో సానియా, బోపన్న జోడీ బ్రెజిల్కు చెందిన స్టెఫానీ, మాతోస్తో తలపడుతుంది. మిగతా మ్యాచ్ల విషయానికొస్తే పురుషుల సింగిల్స్లో జొకోవిచ్ 6-1, 6-2, 6-4తో రుబ్లెవ్పై అలవోకగా సెమీస్లోకి ప్రవేశించాడు. సెమీస్లో పాల్తో జొకోవిచ్ తలపడనున్నాడు. మహిళల సింగిల్స్లో సబలెంకా 6-3, 6-2తో వెకిచ్పై, లినెట్టీ 6-3, 7-5తో ప్లిస్కోవాపై గెలిచి సెమీస్లోకి అడుగుపెట్టారు.