బుడాపెస్ట్: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ ఆకృత్యాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కి ఆందోళన చేపట్టిన స్టార్ రెజ్లర్ సంగీత ఫోగట్.. ఆ ఘటన తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నీలోనే ఆకట్టుకుంది. హంగేరీ ర్యాంకింగ్ సిరీస్ మహిళల 59 కేజీల విభాగంలో బరిలోకి దిగిన సంగీత కాంస్య పతకం ఖాతాలో వేసుకుంది.
మహిళా రెజ్లర్లతో బ్రిజ్ భూషణ్ తప్పుగా వ్యవహరించాడని ఆరోపిస్తూ.. అతడిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని ఢిల్లీలో దీక్ష చేపట్టిన కుస్తీ వీరులు.. ప్రస్తుతం వివిధ టోర్నీల్లో పాల్గొంటున్నారు. ఈ ఏడాది ఆసియా క్రీడల నేపథ్యంలో నిరసనలకు బ్రేక్ ఇచ్చిన మల్లయోధులు.. న్యాయపరంగా తమ పోరాటం కొనసాగిస్తామని వెల్లడించిన విషయం తెలిసిందే.