న్యూఢిల్లీ: జాతీయ, అంతర్జాతీయ క్రీడా టోర్నీల్లో మన అథ్లెట్లు సత్తా చాటేందుకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) కార్యాచరణ మొదలుపెట్టింది. క్రీడా పోటీలకు అథ్లెట్లను సన్నద్ధం చేసేందుకు సాయ్ భారీగా కోచ్ల నియామకం చేపట్టింది. 398 మంది శిక్షకులను నియమించినట్లు బుధవారం భారత క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ టోర్నీలతో పాటు పారిస్ (2024), లాస్ఏంజిల్స్ (2028) ఒలింపిక్స్ కోసం కోచ్లను నియమించింది. వీరికి అదనంగా 101 మంది కోచ్లు డిప్యూటేషన్పై రానున్నారు. అనుభవజ్ఞులు, సీనియర్ అథ్లెట్లకు కోచ్లుగా అవకాశం కల్పించింది. ఆసియా క్రీడల చాంపియన్ భజరంగ్ లాల్ ఠాకూర్ రోయింగ్ కోచ్గా, కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత శిల్పి షియోరన్ రెజ్లింగ్ సహాయ కోచ్గా, జిన్సి ఫిలిప్ అథ్లెటిక్స్ కోచ్గా ఎంపిక చేసింది. ‘ఒలింపిక్స్తో పాటు జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో భారత అథ్లెట్లు సన్నద్ధమయ్యేందుకు ఈ నియామకాలు చేపట్టాం. అథ్లెట్లకు అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తాం’ అని భారత క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది.