అహ్మదాబాద్: అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టును మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభినందించాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్కప్ ఫైనల్లో భారత అమ్మాయిలు 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తుచేసి విశ్వ విజేతలుగా నిలిచారు. దీంతో షఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టుకు బీసీసీఐ ప్రకటించిన రూ. 5 కోట్ల నజరానాను బుధవారం బోర్డు సభ్యులు అందజేశారు.
భారత్, న్యూజిలాండ్ మూడో టీ20కి ముందు అమ్మాయిల బృందాన్ని సచిన్ అభినందించాడు. ఈ సందర్భంగా మాస్టర్ మాట్లాడుతూ.. ‘అద్వితీయమైన ఘనత సాధించిన జట్టుకు శుభాకాంక్షలు. మీ ప్రదర్శనతో యావత్ దేశం సంబురాలు జరుపుకుంటున్నది. 1983 వన్డే ప్రపంచకప్ విజయం నాలో క్రికెట్పై ప్రేమ పెంచింది. అలాగే మీరిప్పుడు ఎందరో చిన్నారుల కలలకు బీజం వేశారు’ అని అన్నాడు.